
బెంగళూరు: ప్రొకబడ్డి లీగ్ ఏడో సీజన్లో మరో మ్యాచ్ ఫలితం తేలకుండా ముగిసింది. గుజరాత్ జెయింట్స్తో మంగళవారం జరిగిన రెండో మ్యాచ్లో కీలక సమయంలో సత్తా చాటిన యు ముంబా ఓటమి నుంచి గట్టెక్కింది. యు ముంబా రైడర్ అభిషేక్ సింగ్ ఒకే రైడ్లో మూడు పాయింట్స్ తేవడంతో 24-24తో మ్యాచ్ను టై చేసుకుంది. ఇక ఆ జట్టులో రైడర్ అజిత్ 8 పాయింట్స్ సాధించగా డిఫెండర్ రింకూ 5 పాయింట్స్ రాబట్టాడు.
గుజరాత్లో అజయ్ కుమార్ 7 పాయింట్స్తో సత్తా చాటగా.. కీలక సమయంలో ఆ జట్టు తడబడి విజయాన్ని చేజార్చుకుంది. ఫస్టాఫ్ ముగిసే సరికి 13-10 తో మూడు పాయింట్స్ లీడ్లో ఉన్న ఆ జట్టు.. సెకండాఫ్లోనూ అదే జోరును కొనసాగించింది. కానీ చివర్లో అభిషేక్ సింగ్ మల్టిపుల్ పాయింట్స్తో మ్యాచ్ ఫలితాన్నే మార్చాడు. అతనికి తోడు డిఫెండర్ రింకూ చెలరేగడంతో సెకండాఫ్లో 14 పాయింట్స్ సాధించిన యు ముంబా ఓటమి నుంచి గట్టెక్కింది.
అంతకు ముందు జరిగిన మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 32-29తో పాట్నా పైరేట్స్ను ఓడించింది. ఈ విజయంతో దబాంగ్ ఢిల్లీ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని సొంతం చేసుకోగా.. పాట్నా రెండో స్థానానికి పడిపోయింది. దబాంగ్ ఢిల్లీలో ఆల్రౌండర్లు, విజయ్ (9) సందీప్ నర్వాల్ (8) సత్తా చాటారు. పాట్నాలో సచిన్(5), ప్రశాంత్ కుమార్(6) మినహా అంతా విఫలమయ్యారు. మ్యాచ్ ఆరంభం నుంచే రైడింగ్, ట్యాకిల్ పాయింట్స్తో దుమ్మురేపిన దబాంగ్ ఢిల్లీ.. పాట్నాకు చుక్కలు చూపించింది. ఒకసారి ఆలౌట్ కూడా చేసి ఫస్టాఫ్ ముగిసేసమాయానికి 19-10తో రెండింతల ఆధిక్యం సాధిచింది. సెకండాఫ్లో పాట్నా పుంజుకున్నా.. ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్నందుకుంది. ఢిల్లీని ఒకసారి ఆలౌట్ చేసిన పాట్నా సెకండాఫ్లో 19 పాయింట్లతో చెలరేగినా ఫలితం లేకపోయింది.