ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10లో తెలుగు టైటాన్స్ పరాజయాల పరంపర కొనసాగుతోంది. మంగళవారం ఏకపక్షంగా సాగిన మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 46-26 తేడాతో తెలుగు టైటాన్స్ను చిత్తు చేసింది. ఇది తెలుగు టైటాన్స్ పదో పరాజయం కావడం గమనార్హం. ఇప్పటి వరకు 11 మ్యాచ్లు ఆడిన తెలుగు టైటాన్స్.. ఒక్కటంటే ఒక్క మ్యాచ్ మాత్రమే గెలిచింది.
మ్యాచ్ ఆరంభం నుంచే తెలుగు టైటాన్స్ తేలిపోయింది. బెంగాల్ వారియర్స్ సూపర్ రైడింగ్, సమర్థవంతమైన ట్యాక్లింగ్ ముందు తెలుగు టైటాన్స్ ఆటగాళ్లు నిలబడలేకపోయారు. ఫస్టాఫ్లో రెండు సార్లు తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేసిన బెంగాల్ వారియర్స్ 27-10తో భారీ లీడ్ సాధించింది.

సెకండాఫ్లో తులుగు టైటాన్స్ కాస్త పుంజుకొని బెంగాల్ వారియర్స్ను ఆలౌట్ చేసినా.. ఆ జట్టు అవకాశం ఇవ్వలేదు. డిఫెన్స్లో సత్తా చాటి తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేసి భారీ విజయాన్ని అందుకుంది.
ఇరు జట్లు చెరో 49 సార్లు రైడింగ్కు వెళ్లగా.. తెలుగు టైటాన్స్ 13, బెంగాల్ వారియర్స్ 17 సార్లు సక్సెస్ అయ్యాయి. ట్యాక్లింగ్లో తెలుగు టైటాన్స్ 25 ప్రయత్నాల్లో 9 సార్లే సక్సెస్ అవ్వగా.. బెంగాల్ వారియర్స్ 27 ప్రయత్నాల్లో 18 సార్లు సక్సెస్ సాధించింది. ఇందులో ఒక సూపర్ ట్యాకిల్ కూడా ఉంది.
తెలుగు టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్ 11 పాయింట్లతో సత్తా చాటగా.. డిఫెండర్ సందీప్ 4 పాయింట్లు సాధించాడు. బెంగాల్ వారియర్స్ టీమ్లో డిఫెండర్ వైవ్ గర్జే 9 పాయింట్స్ సాధించగా.. రైడర్ నితిన్ కుమార్(9), విశ్వాస్(8), కెప్టెన్ శుభమ్ షిండే(6) పాయింట్లతో సత్తా చాటారు.
బుధవారం రెండు మ్యాచ్లు జరగనుండగా తొలి మ్యాచ్లో యూపీ యోధాస్, తమిళ్ తలైవాస్ తలపడనున్నాడు. రెండో మ్యాచ్లో యు ముంబా వర్సెస్ హర్యానా స్టీలర్స్ అమీతుమీ తేల్చుకోనున్నాయి.