ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 10లో జైపూర్ పింక్ పాంథర్స్ సెమీఫైనల్ చేరింది. సోమవారం జరిగిన లీగ్ మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 67-30 తేడాతో యూపీ యోధాస్ను చిత్తు చేసింది. జైపూర్ రైడర్ అర్జున్ దేశవాల్ 20 పాయింట్లతో దుమ్మురేపాడు. డిఫెండర్ అంకుష్ 7, కెప్టెన్ సునీల్ కుమార్ 5 పాయింట్లతో సత్తా చాటారు.
యూపీ యోధాస్ జట్టులో గగణ గౌడ ఒక్కడే 10 పాయింట్లతో రాణించాడు. హితేష్ 5 పాయింట్లతో పర్వాలేదనిపించాడు. మ్యాచ్ ఆరంభం నుంచి జైపూర్ పింక్ పాంథర్స్ సత్తా చాటింది. ఫస్టాఫ్లో యూపీ యోధాస్ను ఒకసారి ఆలౌట్ చేసి 23-11 తేడాతో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్లో మరింత దూకుడుగా ఆడిన జైపూర్.. యూపీని ఏకంగా నాలుగు సార్లు ఆలౌట్ చేసింది. దాంతో యూపీ కోలుకోలేకపోయింది. ఈ మ్యాచ్లో ఇరు జట్లు 49 సార్లు రైడింగ్ చేయగా.. జైపూర్ 27 సార్లు ఫలితం రాబట్టగా.. యూపీ యోధాన్ 12 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది.

ట్యాక్లింగ్లో యూపీ 38 ప్రయత్నాల్లో 9 సార్లు మాత్రమే సక్సెస్ అయ్యింది. జైపూర్ పింక్ పాంథర్స్ 30 ప్రయత్నాల్లో 15 సార్లు ఫలితం రాబట్టింది. 22 సార్లు రైడింగ్ వెళ్లిన అర్జున్ దేశ్వాల్ 17 సార్లు సక్సెస్ అయ్యి 20 పాయింట్స్ తెచ్చాడు. ఇందులో 18 టచ్ పాయింట్స్, 2 బోనస్ ఉన్నాయి. మరో నాలుగు సార్లు మాత్రం ఔటయ్యాడు.
ఈ విజయంతో జైపూర్ పాయింట్స్ టేబుల్లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. జైపూర్తో పాటు టాప్-4లో నిలిచిన పుణేరి పల్టాన్, దబాంగ్ ఢిల్లీ, గుజరాత్ జెయింట్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. మరో మ్యాచ్లో బెంగాల్ వారియర్స్ 46-34తో యు ముంబాను ఓడించింది.