కార్పొరేట్ హంగులు అద్దుకున్న భారత దేశ పల్లే క్రీడ కబడ్డీ మళ్లీ అలరించేందుకు సిద్దమైంది. ఇప్పటికే 10 సీజన్లు దిగ్విజయంగా పూర్తి చేసుకున్న ప్రోకబడ్డీ లీగ్ 11వ సీజన్కు ముస్తాబైంది. అప్కమింగ్ సీజన్(2024-25)కు అక్టోబర్ 18న తెరలేవనుంది. ఈ టోర్నీకి సంబంధించిన అధికారిక షెడ్యూల్ను టోర్నీ నిర్వాహకులు సోమవారం ప్రకటించారు.
హైదరాబాద్ వేదికగానే ఆరంభ మ్యాచ్లు జరగనున్నాయి. అక్టోబర్ 18న తెలుగు టైటాన్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్తో ప్రో కబడ్డీ లీగ్ సీజన్ 11కు తెరలేవనుంది. అదే రోజు జరిగే రెండో మ్యాచ్లో యూ ముంబా వర్సెస్ దబాంగ్ ఢిల్లీ తలపడనున్నాయి.

ఈ సారి ప్రోకబడ్డీ లీగ్ను మూడు నగరాలకు మాత్రమే పరిమితం చేశారు. అక్టోబర్ 19 నుంచి నవంబర్ 9 వరకు హైదరాబాద్, గచ్చిబౌలిలోని జీఎంసీ బాలయోగి స్పోర్ట్స్ కాంప్లెక్స్లో మ్యాచ్లు జరగనున్నాయి. నోయిడాలో నవంబర్ 10 నుంచి డిసెంబర్ 1 వరకు, పుణే వేదికగా డిసెంబర్ 3 నుంచి 24 వరకు కబడ్డీ మ్యాచ్లు నిర్వహించనున్నారు. ప్లే ఆఫ్స్, ఫైనల్ మ్యాచ్ల షెడ్యూల్ను టోర్నీ ప్రారంభమైన తర్వాత ప్రకటించనున్నారు. తొలి మ్యాచ్ రాత్రి 8 గంటలకు, రెండో మ్యాచ్ రాత్రి 9 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ టోర్నీ మరింత రసవత్తరంగా సాగేలా షెడ్యూల్ను రూపొందించామని పీకేఎల్ కమిషనర్ అనుపమ్ గోస్వామి తెలిపారు. ఈ సీజన్ కబడ్డీ అభిమానుల అంచనాలను అందుకుంటుందని ఆశాభావాం వ్యక్తం చేశారు.
ఇప్పటికే ఈ సీజన్కు సంబంధించిన వేలం పూర్తయిన విషయం తెలిసిందే. స్టార్ ఆటగాళ్ల కోసం ఫ్రాంచైజీలు రూ. కోట్లు కురిపించాయి. లీగ్ చరిత్రలోనే మునుపెన్నడూ లేని విధంగా ఈసారి 8 మంది కబడ్డీ ఆటగాళ్లు కోట్లు పలికారు.