PKL Season 10: ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 10కి రంగం సిద్దమైంది. డిసెంబర్ 2 నుంచి ఈ మెగా లీగ్ అలరించనుంది. కండలు తిరిగిన ఆటగాళ్లు కబడ్డీ కూతతో అభిమానులను ఆకట్టుకోనున్నారు. గ్రామీణ క్రీడ అయిన కబడ్డీకి ఆదరణ పెంచేందుకు బాలకృష్ణ రంగంలోకి దిగాడు. ఈ సీజన్కు అతను బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తున్నారు.
బాలయ్య బాబుతో కూడిన స్పెషల్ ప్రోమోలను అధికారిక బ్రాడ్కాస్టర్ స్టార్ స్పోర్ట్స్ రిలీజ్ చేసింది. కన్నడలో కిచ్చా సుదీప్, హిందీలో టైగర్ ష్రాఫ్ కబడ్డీ లీగ్ ప్రచారాన్ని భుజాలపై ఎత్తుకున్నారు. ఈ ముగ్గురు స్టార్ హీరోలతో కూడిన ప్రోమోను మంగళవారం స్టార్ స్పోర్ట్స్ (నవంబర్ 21) రిలీజ్ చేసింది. 'గుండెల దమ్మే ఇంధనము.. మైదానమే రణస్థలము'అనే ప్రత్యేకమైన పాటతో సాగిన ఈ ప్రోమో అభిమానులను ఆకట్టుకుంది.

కబడ్డీ కోర్టును ఓ యుద్ద భూమిలా చూపిస్తూ ఈ ముగ్గురు యోధులు యుద్ధం చేసినట్లుగా ఈ ప్రోమోలో చూపించారు. ఇక చివర్లో బాలయ్య బాబు తనదైన శైలిలో తొడ కొట్టాడు. తెలుగు ప్రోమోను స్టార్ స్పోర్ట్స్ తెలుగు సోషల్ మీడియా వేదికగా పంచుకోగా...నెట్టింట వైరల్గా మారింది.
ఈ సీజన్లో మొత్తం 12 జట్లు పోటీ పడుతున్నాయి. వచ్చే ఏడాది ఫిబ్రవరి 21 వరకు సాగే ఈ టోర్నీలో మొత్తం 132 లీగ్ మ్యాచ్లు జరగనున్నాయి. 12 ఫ్రాంచైజీలకు చెందిన 12 నగరాల్లో ఈ మ్యాచ్లు జరగనున్నాయి. అన్ని బృందాలు ఒక్కో నగరంలో తలో 6 రోజుల పాటు ఉంటాయి. మొదటి 6 రోజులు అహ్మదాబాద్లో మ్యాచ్లు జరుగుతాయి.
ఆపై బెంగళూరు, పూణే, చెన్నై, నోయిడా, ముంబై, జైపూర్, హైదరాబాద్, పాట్నాలో పాటు ఢిల్లీ, కోల్కతా వేదికగా మ్యాచ్లు జరగనున్నాయి. లీగ్ మ్యాచ్ల అనంతరం ప్లేఆఫ్స్, ఫైనల్ మ్యాచ్లు జరుగుతాయని, షెడ్యూల్ను త్వరలోనే వెల్లడిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈ సీజన్ తొలి మ్యాచ్ గుజరాత్ జెయింట్స్, తెలుగు టైటాన్స్ మధ్య అహ్మదాబాద్లోని 'ది ఎరీనా బై ట్రాన్స్స్టాడియా'లో జరగనుంది.