సీజన్లు గడుస్తున్నా.. కెప్టెన్లు మారినా.. కొత్త ఆటగాళ్లు వచ్చినా.. తెలుగు టైటాన్స్ రాత మాత్రం మారడం లేదు. ప్రొకబడ్డీ లీగ్ 12వ సీజన్ను కూడా తెలుగు టైటాన్స్ ఓటమితోనే ప్రారంభించింది. సాగర తీరం విశాఖ వేదికగా అంగరంగ వైభవంగా శక్రవారం మొదలైన ఈ టోర్నీలో తెలుగు టైటాన్స్ తీవ్రంగా నిరాశపర్చింది. తొలి మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 35-38 తేడాతో తమిళ తలైవాస్ చేతిలో ఓటమిపాలైంది. విజయం కోసం ఆఖరి వరకు పోరాడినా ఫలితం దక్కలేదు. దేశ్వార్ 12 పాయింట్లతో తలైవాస్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
పవన్ సెహ్రావత్ 9 పాయింట్స్ సాధించాడు. తెలుగు టైటాన్స్ తరఫున భరత్ హుడా 11 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు. ఫస్టాఫ్లో ఇరు జట్లూ హోరా హోరీగా తలపడగా.. తలైవాస్ 14-13తో స్వల్ప ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్లో పుంజుకున్న టైటాన్స్ ప్రత్యర్థిని ఆలౌట్ చేసి 19-14తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. కానీ సెహ్రావత్ అద్భుత ప్రదర్శనతో తలైవాస్ పుంజుకుని 28-28తో స్కోర్ను సమం చేసింది. అనంతరం మరింత దూకుడుగా ఆడిన ఆ జట్టు విజయం కైవసం చేసుకుంది.

బెంగళూరు బుల్స్, పుణెరి పల్టాన్ మధ్య జరిగిన రెండో మ్యాచ్ 32-32తో టై అయ్యింది. ఫలితం నిర్ణయించేందుకు కొత్త రూల్స్ ప్రకారం 5 రైడ్స్ ఆడించగా.. పుణెరి 6-4తో విజయం సాధించింది. బెంగళూరులో ఆకాశ్ షిండే(12) రాణించగా.. పుణెరి తరఫున ఆదిథ్య షిండే(9) సత్తా చాటాడు. ఈ టోర్నీని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు ప్రారంభించగా.. యువ క్రికెటర్ వైభవ్ సూర్యవంశీ, అథ్లెట్ జ్యోతి యర్రాజి ప్రత్యేక అతిథులుగా హాజరయ్యారు. నేడు జరిగే పోటీల్లో యూపీ యోధాస్తో తెలుగు టైటాన్స్, గుజరాత్ టైటాన్స్తో యు ముంబా తలపడనుంది.