ప్రొ కబడ్డీ లీగ్ సీజన్ 12లో జైపూర్ పింక్ పాంథర్స్ సంచలన విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం గుజరాత్ జెయింట్స్తో ఉత్కంఠకే ఊపిరి అందని రీతిలో సాగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ గోల్డెన్ రైడ్తో గట్టెక్కింది. ఈ మ్యాచ్ ముగిసే సమయానికి ఇరు జట్లు 30-30తో సమంగా నిలిచాయి. దాంతో టోర్నీ నయా రూల్స్ ప్రకారం 5 సూపర్ రైడ్స్ ఆడించగా.. అందులోనూ ఇరు జట్లు సమంగా నిలిచాయి. దాంతో గోల్డెన్ రైడ్ ద్వారా ఫలితాన్ని తేల్చారు. జైపూర్ స్టార్ రైడర్ నితిన్ కుమార్ గోల్డెన్ రైడ్లో జైపూర్కు విజయాన్నందించాడు.
ఈ మ్యాచ్లో అతను 15 రైడ్స్తో జైపూర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలక సమయంలో అతను తీసుకొచ్చిన పాయింట్స్ మ్యాచ్ను మలుపు తిప్పాయి. గుజరాత్ జెయింట్స్లో రాకేష్ 11 పాయింట్లతో రాణించినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచే ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. నువ్వా-నేనా అన్నట్లు సాగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు ఒక్కో పాయింట్తో ముందుకు సాగాయి. దాంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి గుజరాత్ జెయింట్స్ 16-15తో జైపూర్పై ఆధిక్యం సాధించింది.

సెకండాఫ్లో ఇరు జట్లు అదే జోరును కొనసాగించాయి. చెరో సారి ఆలౌట్ చేసుకున్నాయి. ఇరు జట్ల స్కోర్లు టై అయ్యాయి. సూపర్-5రైడ్స్లోనూ ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. గుజరాత్ జెయింట్స్ ఆధిక్యంలో ఉన్న సమయంలో నితిన్ 4 పాయింట్ల రైడ్తో జైపూర్ను రేసులోకి తీసుకొచ్చాడు. దాంతో ఐదు సూపర్ రైడ్స్లోనూ స్కోర్లు టై అయ్యాయి. దాంతో గోల్డెన్ రైడ్ ఆడించగా.. నితిన్ పాయింట్ సాధించి విజయాన్నందించాడు.
ఐదు రైడ్స్ ముగిసినా స్కోర్లు సమమైతే మళ్లీ గోల్డెన్ రైడ్ రూల్ అమలు చేస్తారు. ఇందులో ఇరు జట్లకు చెరో రైడ్ ఇస్తారు. ఏ జట్టు అయితే ముందు పాయింట్ సాధిస్తుందో ఆ జట్టును విజేతగా ప్రకటిస్తారు. ఒక జట్టు మొదటి రైడ్లో పాయింట్ సాధిస్తే, ఆ జట్టే విజేత అవుతుంది. రెండో జట్టుకు రైడ్ అవకాశం ఇవ్వరు. మొదటి రైడ్లో పాయింట్లు రాని పక్షంలోనే.. రెండో జట్టుకు రైడ్ అవకాశం వస్తుంది. ఈ రైడ్స్లో కూడా ఫలితం తేలకపోతే, విజేతను టాస్ ద్వారా నిర్ణయిస్తారు.
అంతకుముందు జరిగిన మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 45-34 తేడాతో బెంగాల్ వారియర్స్ను ఓడించింది. దబాంగ్ ఢిల్లీ విజయంలో అషు మాలిక్(16), అజింక్యా పవార్(8) కీలక పాత్ర పోషించారు. బెంగాల్ వారియర్స్లో దేవాంక్(12), విశ్వాస్(9) రాణించినా ఫలితం లేకపోయింది. ఈ గెలుపుతో దబాంగ్ ఢిల్లీ అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. ఆ జట్టు 4 మ్యాచ్లకు 4 విజయాలు సాధించింది.
యు ముంబా వర్సెస్ తెలుగు టైటాన్స్, రాత్రి 8 గంటలకు
యూపీ యోధాస్ వర్సెస్ పుణేరి పల్టాన్, రాత్రి 9 గంటలకు