ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) 11వ సీజన్లో తెలుగు టైటాన్స్ మరో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. నోయిడా వేదికగా బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 31-29 తేడాతో యు ముంబాను ఓడించింది. ఆశిష్ నర్వాల్ 8 పాయింట్లతో తెలుగు టైటాన్స్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
సాగర్, అజిత్ పవార్, మంజీత్ నాలుగేసి పాయింట్లతో సత్తా చాటారు. యు ముంబా తరఫున మంజీత్ 7 పాయింట్స్తో మెరుగైన ప్రదర్శన చేశాడు. ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి ఇరు జట్లు 12-12తో సమంగా నిలిచాయి. సెకండాఫ్లో మెరుగైన ప్రదర్శన చేసిన తెలుగు టైటాన్స్ చివరివరకు ఆధిక్యాన్ని కాపాడుకొని విజేతగా నిలిచింది.

ఈ మ్యాచ్లో ఇరు జట్లు 48 సార్లు రైడింగ్కు వెళ్లగా తెలుగు టైటాన్స్ 12, యూ ముంబా 16 సార్లు సక్సెస్ అయ్యాయి. ట్యాక్లింగ్లో తెలుగు టైటాన్స్ 26 ప్రయత్నాల్లో 12 సార్లు సఫలమైంది. రెండు సార్లు సూపర్ ట్యాకిల్స్తో సత్తా చాటింది.
మరోవైపు యూ ముంబా 19 ప్రయత్నాల్లో 9 సార్లు మాత్రమే సక్సెస్ సాధించింది. ఒకసారి సూపర్ ట్యాక్లింగ్ చేసింది. తెలుగు టైటాన్స్కు ఇది ఏడో విజయం. ప్రస్తుతం పాయింట్స్ టేబుల్లో తెలుగు టైటాన్స్ ఐదో స్థానంలో కొనసాగుతోంది.
గుజరాత్Xఢిల్లీ మ్యాచ్ టై..
అంతకుముందు గుజరాత్ జెయింట్స్ వర్సెస్ దబంగ్ ఢిల్లీ మధ్య జరిగిన మ్యాచ్ 39-39తో టైగా ముగిసింది. దబాంగ్ ఢిల్లీ తరఫున కెప్టెన్ అషు మాలిక్ 11 పాయింట్స్తో సత్తా చాటగా.. నవీన్ కుమార్ 9 పాయింట్స్తో రాణించాడు.
గుజరాత్ జెయింట్స్ తరఫున ప్రతీక్ దహియా ఒక్కడే 20 పాయింట్స్తో దుమ్మురేపాడు. మహమ్మద్ నబిబక్ష్, జితేందర్ యాదవ్ నాలుగేసి పాయింట్లతో రాణించారు. ఆరంభం నుంచి ఇరు జట్లు హోరా హోరీగా తలపడ్డాయి. ఫస్టాఫ్ ముగిసే సమయానికి దబాంగ్ ఢిల్లీ 20-17తో ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండాఫ్లో గుజరాత్ జెయింట్స్ అసాధారణ ప్రదర్శనతో లెక్కసరి చేసి మ్యాచ్ను టైగా ముగించింది.