ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11లో తెలుగు టైటాన్స్ శుభారంభం చేసింది. లీగ్ ఆరంభ మ్యాచ్లోనే అదిరిపోయే విజయాన్నందుకుంది. బెంగళూరు బుల్స్తో హైదరాబాద్లోని గచ్చిబౌలి ఇండోర్ స్టేడియం వేదికగా శుక్రవారం జరిగిన తొలి పోరులో తెలుగు టైటాన్స్ 37-29 తేడాతో గెలుపొందింది.
తెలుగు టైటాన్స్ కెప్టెన్, స్టార్ రైడర్ పవన్ సెహ్రావత్ 13 పాయింట్స్తో సత్తా చాటాడు. అతనికి తోడుగా రైట్ కార్నర్ డిఫెండర్ క్రిషన్ ఆరు పాయింట్లు సాధించాడు. బెంగళూరు బుల్స్లో స్టార్ రైడర్ ప్రదీప్ నర్వాల్ దారుణంగా విఫలమయ్యాడు. మూడే పాయింట్స్ సాధించాడు. సురిందర్ దెహాల్ 5 పాయింట్లతో టాప్ స్కోరర్గా నిలిచాడు.

మ్యాచ్ ఆరంభం నుంచే దూకుడు కనబర్చిన తెలుగు టైటాన్స్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి 20-11తో భారీ ఆధిక్యంలో నిలిచింది. ఒకసారి బెంగళూరు బుల్స్ను ఆలౌట్ కూడా చేసింది. ఫస్టాఫ్లో 11 రైడింగ్ పాయింట్స్ వస్తే.. ఏడు ట్యాక్లింగ్లో వచ్చాయి.
సెకండాఫ్లో బెంగళూరు బుల్స్ ధీటుగా బదులిచ్చింది. ఇరు జట్లు చెరొకసారి ఆలౌటయ్యాయి. కానీ ఫస్టాఫ్లో భారీ ఆధిక్యం సాధించడం తెలుగు టైటాన్స్కు కలిసొచ్చింది. ఆ ఆధిక్యాన్ని చివరి వరకు కాపాడుకున్న తెలుగు టైటాన్స్ చిరస్మరణీయ విజయాన్ని అందుకుంది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ పవన్ సెహ్రావత్ 24 సార్లు రైడింగ్కు వెళ్లి 11 రైడింగ్ పాయింట్స్ సాధించాడు. మరో 9 అన్సక్సెస్ఫుల్ అవ్వగా... 4 ఖాళీ రైడ్స్ ఉన్నాయి.
రేపు ఇదే మైదానం వేదికగా రాత్రి 8 గంటలకు జరిగే మొదటి మ్యాచ్లో తెలుగు టైటాన్స్.. తమిళ తలైవాస్తో తలపడనుంది.