ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11లో పుణేరి పల్టాన్ ఘన విజయం సాధించింది. శుక్రవారం జరిగిన మ్యాచ్లో పుణేరి పల్టాన్ 56-18 భారీ తేడాతో బెంగళూరు బుల్స్ను చిత్తు చేసింది.
పుణేరి పల్టాన్ తరఫున ఆకాశ్ షిండే, మోహిత్ గయట్, ఆర్యవర్థన్ చెరో 8 పాయింట్స్ సాధించగా.. పంకజ్ మోహిత్(5), అమన్(5) రాణించారు. బెంగళూరు బుల్స్ తరఫున కెప్టెన్ ప్రదీప్ నర్వాల్(7) ఒక్కడే రాణించాడు.

మ్యాచ్ ఆరంభం నుంచే పుణేరి పల్టాన్ జోరు కనబర్చింది. ఫస్టాఫ్లోనే బెంగళూరును రెండు సార్లు ఆలౌట్ చేసి 26-7తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్లోనూ పుణేరి పల్టాన్ అదే జోరు కొనసాగించింది. రైడింగ్, ట్యాక్లింగ్తో బెంగళూరును మరోసారి రెండు సార్లు ఆలౌట్ చేసి విజయలాంఛనాన్ని పూర్తి చేసుకుంది.
ఇప్పటి వరకు 19 మ్యాచ్లు ఆడడిన పుణేరి పల్టాన్ 8 విజయాలు, 8 ఓటములు, మూడు టైలతో ఏడో స్థానంలో కొనసాగుతోంది. మరోవైపు బెంగళూరు బుల్స్ 19 మ్యాచ్ల్లో 2 విజయాలు మాత్రమే నమోదు చేసి పాయింట్స్ టేబుల్లో ఆఖరి స్థానంలో నిలిచింది.
పట్నా పైరేట్స్ విజయం..
ఉత్కంఠగా సాగిన మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 42-38 తేడాతో తమిళ్ తలైవాస్ను ఓడించింది. దేవాంక్(12), అయన్(13) అసాధారణ ప్రదర్శనతో పట్నా పైరేట్స్ విజయంలో కీలక పాత్ర పోషించారు. తమిళ్ తలైవాస్ తరఫున మోయిన్ షఫాగి 11 పాయింట్లతో సత్తా చాటినా ఫలితం లేకపోయింది.
ఫస్టాఫ్లో తమిళ్ తలైవాస్ చేసిన తప్పిదం ఆ జట్టు కొంపముంచింది. మ్యాచ్ ఆరంభం నుంచి జోరు కనబర్చిన పట్నా.. తమిళ్ తలైవాస్ను ఒకసారి ఆలౌట్ చేసి ఫస్టాఫ్ ముగిసే సరికి 20-15తో ఆధిక్యంలో నిలిచింది.
సెకండాఫ్ తమిల్ తలైవాస్ జూలు విధిల్చినా.. పట్నా ధీటుగా పోటీనిచ్చింది. ఒకసారి ఆలౌటైనా.. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకొని విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. ఈ విజయం పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను మెరుగుపర్చింది. మరోవైపు తమిళ్ తైలవాస్.. ప్లే ఆఫ్స్ రేసు నుంచి అధికారికంగా నిష్క్రమించింది. ఇప్పటి వరకు 18 మ్యాచ్లు ఆడిన తమిళ్ తలైవాస్ 6 విజయాలతో 10వ స్థానంలో కొనసాగుతోంది.