ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11లో దబాంగ్ ఢిల్లీ ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంది. సోమవారం జరిగిన మ్యాచ్లో దబాంగ్ ఢిల్లీ 47-25 తేడాతో బెంగాల్ వారియర్స్పై ఘన విజయం సాధించింది. కెప్టెన్ అషుమాలిక్ 17 పాయింట్స్తో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించగా.. యోగేష్(9), ఆశిష్(5) రాణించారు. బెంగాల్ వారియర్స్లో విశ్వాస్(8), నితీష్ కుమార్(5) టాప్ స్కోరర్లుగా నిలిచారు.
ఆరంభం నుంచే దూకుడుగా ఆడిన ఢిల్లీ.. బెంగాల్ వారియర్స్ను ఆలౌట్ చేసి ఫస్టాఫ్ ముగిసే సమయానికి 26-9తో భారీ ఆధిక్యాన్ని సాధించింది. సెకండాఫ్లో బెంగాల్ వారియర్స్ తేరుకున్నా.. ఢిల్లీ అవకాశం ఇవ్వలేదు. మరోసారి ఆలౌట్ చేసి ఆధిక్యాన్ని కాపాడుకొని విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. 20 మ్యాచ్ల్లో 11 విజయాలతో దబాంగ్ ఢిల్లీ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది. దబాంగ్ ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరడం వరుసగా ఇది ఆరోసారి.

తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరాలంటే..?
ఇప్పటికే హరియాణా స్టీలర్స్ ప్లే ఆఫ్స్కు అర్హత సాధించిన విషయం తెలిసిందే. దాంతో ప్లే ఆఫ్స్ సమరం రసవత్తరంగా మారింది. మరో రెండు స్థానాల కోసం పట్నా పరైట్స్, యూపీ యోధాస్, యూ ముంబా, తెలుగు టైటాన్స్, జైపూర్ పింక్ పాంథర్స్ పోటీ పడుతున్నారు.
దబాంగ్ ఢిల్లీ ప్లే ఆఫ్స్ చేరడంతో తెలుగు టైటాన్స్ సమీకరణం సంక్లిష్టంగా మారింది. 20 మ్యాచ్ల్లో 11 విజయాలతో తెలుగు టైటాన్స్ ఆరో స్థానంలో కొనసాగుతోంది. చివరి మూడు మ్యాచ్లకు మూడు గెలిస్తేనే తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరనుంది. రెండు విజయాలు నమోదు చేస్తే మాత్రం ఇతర జట్ల ఫలితాలపై ఆధారపడాల్సి ఉంటుంది.
పట్నా పైరేట్స్ విజయం..
సోమవారమే జరిగిన మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్37-32 తేడాతో పుణేరి పల్టాన్ను ఓడించింది. దేవాంక్(11), అయాన్(9) పట్నా విజయంలో కీలక పాత్ర పోషించారు. ఈ విజయంతో పట్నా ప్లే ఆఫ్స్ అవకాశాలు మెరుగయ్యాయి. ప్రస్తుతం ఆ జట్టు 19 మ్యాచ్ల్లో 12 విజయాలతో మూడో స్థానంలో కొనసాగుతోంది. ఇంకా ఆ జట్టు నాలుగు మ్యాచ్లు ఆడాల్సి ఉంది. ఇందులో మూడు గెలిచినా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.
నేటి షెడ్యూల్..
హరియాణా స్టీలర్స్ వర్సెస్ యూపీ యోధాస్(రాత్రి 8 గంటలకు)
జైపూర్ పింక్ పాంథర్స్ వర్సెస్ బెంగళూరు బుల్స్(రాత్రి 9 గంటలకు)