ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11లో తెలుగు టైటాన్స్ పోరాటం ముగిసింది. ప్లే ఆఫ్స్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ ఓటమిపాలైంది. బుధవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 37-41 తేడాతో పట్నా పైరేట్స్ చేతిలో ఓటమిపాలైంది. ఈ విజయంతో పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ చేరింది.
మ్యాచ్ ఆరంభం నుంచి ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఫస్టాఫ్లో పట్నా పరైట్స్ను ఒకసారి ఆలౌట్ చేసినా.. తెలుగు టైటాన్స్ 18-19తో వెనుకంజలో నిలిచింది. సెకండాఫ్లో ఇరు జట్లు నువ్వా నేనా అన్నట్లు తలపడ్డాయి. చెరో పాయింట్తో మ్యాచ్ను ఉత్కంఠగా మార్చాయి. కీలక సమయంలో తెలుగు టైటాన్స్ను ఆలౌట్ చేసిన పట్నా.. పైచేయిసాధించింది.

నాలుగు పాయింట్స్ ఆధిక్యంతో మ్యాచ్ను సొంతం చేసుకుంది. పట్నా విజయంలో దేవాంక్(14), కెప్టెన్ అంకిత్(6) కీలక పాత్ర పోషించారు. తెలుగు టైటాన్స్ తరఫున కెప్టెన్ పవన్ సెహ్రావత్(9) రాణించినా ఫలితం లేకపోయింది.
ఈ పరాజయంతో ప్లే ఆఫ్స్ రేసు నుంచి తప్పుకున్న తెలుగు టైటాన్స్ టాప్-6 ప్లేస్ కోసం మరో మ్యాచ్ గెలవాల్సి ఉంది. చాలా సీజన్ల తర్వాత తెలుగు టైటాన్స్ ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేసింది. కీలక సమయంలో కెప్టెన్ పవన్ సెహ్రావత్ గాయంతో జట్టుకు దూరమవ్వడం తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలను దెబ్బతీసింది.
హర్యానా స్టీలర్స్, పాట్నా పైరేట్స్తో పాటు దబాంగ్ ఢిల్లీ, యూపీ యోధాస్ ప్లే ఆఫ్స్ చేరాయి. మరో మ్యాచ్లో తమిళ్ తలైవాస్ 60-29 తేడాతో బెంగాల్ వారియర్స్ను చిత్తు చేసింది.