ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్ సీజన్ 11లో తెలుగు టైటాన్స్కు మరో పరాజయం ఎదురైంది. శనివారం జరిగిన మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 28-41 తేడాతో జైపూర్ పింక్ పాంథర్స్ చేతిలో ఓటమిపాలైంది. తెలుగు టైటాన్స్ కెప్టెన్ విజయ్ మాలిక్(17) ఆల్రౌండ్ ప్రదర్శనతో ఒంటరిపోరాటం చేశాడు. ఇతర ఆటగాళ్ల నుంచి సహకారం లభించకపోవడంతో ఓటమి తప్పలేదు.
ముఖ్యంగా సెకండాఫ్లో తడబడటం తెలుగు టైటాన్స్ కొంపముంచింది. మ్యాచ్ ప్రారంభంలో జైపూర్కు తెలుగు టైటాన్స్ గట్టి పోటీనిచ్చింది. రైడింగ్తో పాటు ట్యాక్లింగ్లోనూ కెప్టెన్ విజయ్ సత్తా చాటాడు. మరోవైపు జైపూర్ పింక్ పాంథర్స్ కూడా ధీటుగా బదులివ్వడంతో ఫస్టాఫ్ ముగిసే సరికి ఇరు జట్లు 18-18తో సమంగా నిలిచాయి.

అయితే సెకాండాఫ్లో జైపూర్ పింక్ పాంథర్స్ దూకుడు కనబర్చడంతో తెలుగు టైటాన్స్ తేలిపోయింది. కెప్టెన్ విజయ్కు అండగా మరొకరు రాణించకపోవడంతో తెలుగు టైటాన్స్కు ఓటమి తప్పలేదు. జైపూర్ టీమ్లో నీరజ్(12), కెప్టెన్ అర్జున్(11) పాయింట్లతో చెలరేగడంతో తెలుగు టైటాన్స్ రెండు సార్లు ఆలౌటైంది. దాంతో ఆ జట్టు కోలుకోలేకపోయింది.
ఈ సీజన్లో మెరుగైన ప్రదర్శన చేస్తున్న తెలుగు టైటాన్స్ ఇప్పటి వరకు 15 మ్యాచ్లు ఆడి 9 విజయాలతో పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది.
మరో మ్యాచ్లో పట్నా పైరేట్స్ 54-29తో బెంగళూరు బుల్స్ను చిత్తు చేసింది. దేవాంక్(17), అయాన్(13) పట్నా విజయంలో కీలక పాత్ర పోషించారు. బెంగళూరు తరఫున జై 9 పాయింట్లతో సత్తా చాటగా.. ప్రదీప్ నర్వాల్ 8 పాయింట్లతో రాణించాడు.