ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) 11వ సీజన్లో జైపూర్ పింక్ పాంథర్స్ మరో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 33-30 తేడాతో యూపీ యోధాస్పై విజయం సాధించింది. ఆఖరి నిమిషం వరకు హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్నే విజయం వరించింది.
ఆరంభం నుంచి ఆధిక్యంలో నిలిచిన యూపీ యోధాస్ చివర్లో తడబడి సునాయసంగా గెలిచే మ్యాచ్లో ఓటమిపాలైంది. జైపూర్ పింక్ పాంథర్స్ తరఫున నీరజ్ నర్వాల్(9), రేజా మిర్బాగేరి(5), అర్జున్ దేశ్వాల్(5) సత్తా చాటారు. యూపీ యోధాస్లో ఆల్రౌండర్ భరత్(7), హితేష్(5), సుమిత్(5) రాణించినా ఫలితం లేకపోయింది.

ఆరంభం నుంచే ఇరు జట్లు హోరా హోరాగా తలపడ్డాయి. రైడింగ్, ట్లాక్లింగ్లో కాస్త మెరుగ్గా రాణించిన యూపీ యోధాస్ ఫస్టాఫ్ ముగిసే సమయానికి 17-15తో 2 పాయింట్ల ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్లోనూ అదే జోరు కనబర్చింది. కానీ జూలు విధిల్చిన జైపూర్ పింక్ పాంథర్స్ వరుస పాయింట్స్తో ఆలౌట్ చేసి పైచేయి సాధించింది. ఈ ఆలౌట్ పాయింట్స్ యూపీ యోధాస్ ఓటమిని శాసించింది.
ఈ మ్యాచ్లో ఇరు జట్లు 42 సార్లు రైడింగ్కు వెళ్లగా.. జైపూర్ పింక్ పాంథర్స్ 13 సార్లు సక్సెస్ సాధించింది. యూపీ యోధాస్ 11 సార్లే సక్సెస్ అయ్యింది. ట్యాక్లింగ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 20 ప్రయత్నాల్లో 14 సార్లు సక్సెస్ అవ్వగా.. యూపీ యోధాస్ 22 ప్రయత్నాల్లో 10 సార్లు సక్సెస్ అయ్యింది.