ప్రో కబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11లో దబంగ్ ఢిల్లీ సెమీఫైనల్ దూసుకెళ్లింది. సోమవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో ఢిల్లీ 41-35 తేడాతో గుజరాత్ జెయింట్స్ను ఓడించింది. అషు మలిక్(14) అసాధారణ ప్రదర్శనతో ఢిల్లీ విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఆరంభం నుంచి దూకుడుగా ఆడిన ఢిల్లీ ఫస్టాఫ్ ముగిసే సమయానికి 20-17తో ఆధిక్యంలో నిలిచింది. సెకండాఫ్లోనూ అదే జోరు కొనసాగించి విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ గెలుపుతో దబాంగ్ ఢిల్లీ పాయింట్స్ టేబుల్లో రెండో స్థానంలో నిలిచింది. 22 మ్యాచ్ల్లో 13 విజయాలతో పాటు 4 టైలతో ముందంజ వేసింది. పట్నా పైరేట్స్ కూడా 13 విజయాలు సాధించినా.. అత్యధిక టైలతో ఢిల్లీకి సెకండ్ ప్లేస్ దక్కింది.

16 విజయాలతో హర్యానా స్టీలర్స్ టాప్ ప్లేస్ దక్కించుకోని సెమీఫైనల్ చేరిన సంగతి తెలిసిందే. పట్నా పైరేట్స్, యూపీ యోధాస్, జైపూర్ పింక్ పాంథర్స్ మూడు, నాలుగు, ఐదు స్థానాల్లో నిలిచి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించాయి. ఆరో స్థానంలో యూ ముంబా, తెలుగు టైటాన్స్ మధ్య పోటీ నెలకొంది. తెలుగు టైటాన్స్ ఇప్పటికే ఆడాల్సిన మ్యాచ్లు అయిపోగా.. ముంబాకు ఓ మ్యాచ్ మిగిలింది. ఈ మ్యాచ్ ఫలితాన్ని బట్టి చివరి ప్లే ఆఫ్స్ బెర్త్ ఎవరిదా? అనేది తేలనుంది.
నేటి రాత్రి 9 గంటలకు బెంగాల్ వారియర్స్తో యుముంబా తలపడనుంది. ఈ మ్యాచ్లో విజయం సాధిస్తే ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతోంది. 48 పాయింట్ల తేడాతో ఓటమిపాలైతే మాత్రం తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరుతోంది. ప్రో కబడ్డీ చరిత్రలోనే ఇలాంటి ఫలితం ఇప్పటి వరకు ఎదురు కాలేదు. సోమవారం జరిగిన మరో మ్యాచ్లో పుణెరి పల్టాన్ 42-32 తేడాతో తమిళ్ తలైవాస్ను ఓడించింది. ఆర్యవర్దన్(10), అజిత్(7) పుణెరి పల్టాన్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
పీకేఎల్ ఫ్లే ఆఫ్స్ ఫార్మాట్ ఏంటంటే..?
ఇతర టోర్నీలతో పోల్చితే ప్రోకబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ విభిన్నంగా ఉంటుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయి. టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్-1 , సెమీఫైనల్-2 చేరుతాయి. తర్వాతి నాలుగు జట్లు ఎలిమినేటర్-1, ఎలిమినేటర్-2 మ్యాచ్లు ఆడుతాయి. ఎలిమినేటర్-1లో గెలిచిన జట్టు సెమీఫైనల్-2, ఎలిమినేటర్-2లో గెలిచిన జట్టు సెమీఫైనల్-1 ఆడుతాయి.
Telugu Titans Qualification scenario! 🤼
— Kabaddi Time (@Kabadditime) December 22, 2024
📸© PKL pic.twitter.com/P16D78qJEa