ప్రోకబడ్డీ ప్రీమియర్ లీగ్(పీకేఎల్) సీజన్ 11 లీగ్ దశను తెలుగు టైటాన్స్ విజయంతో ముగించింది. శుక్రవారం జరిగిన తమ ఆఖరి లీగ్ మ్యాచ్లో తెలుగు టైటాన్స్ 48-36 తేడాతో పుణేరి పల్టాన్ను చిత్తు చేసింది. ఈ భారీ విజయంతో తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ అవకాశాలు సజీవంగా మారాయి.
కెప్టెన్ పవన్ సెహ్రావత్(15), ఆశిష్ నర్వాల్(11), అంకిత్(6) సత్తా చాటడంతో తెలుగు టైటాన్స్ భారీ విజయం సాధించింది. పుణేరి పల్టాన్ తరఫున ఆర్యవర్థన్ నవలే(8) , అజిత్(10) రాణించినా ఫలితం లేకపోయింది. మ్యాచ్ ఆరంభం నుంచి తెలుగు టైటాన్స్ ఆధిపత్యం చెలాయించింది. ఫస్టాఫ్లోనే పుణేరి పల్టాన్ను ఆలౌట్ చేసిన తెలుగు టైటాన్స్ విరామ సమయానికి 25-16తో భారీ ఆధిక్యం సొంతం చేసుకుంది.

సెకండాఫ్లో పుణేరి పల్టాన్ పుంజుకుంది. దాంతో ఇరు జట్ల మధ్య హోరాహోరీ పోరును తలపడించింది. సెకండాఫ్లో ఇరు జట్లు చెరోసారి ఆలౌటయ్యాయి. ఆఖరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న తెలుగు టైటాన్స్ భారీ విజయాన్ని సొంతం చేసుకుంది.
ఈ గెలుపుతో తెలుగు టైటాన్స్ పాయింట్స్ టేబుల్లో ఏడో స్థానంలో నిలిచింది. మొత్తం 22 మ్యాచ్ల్లో 12 విజయాలు, 10 ఓటములు నమోదు చేసింది. ఆరోస్థానంలో ఉన్న ముంబై 20 మ్యాచ్ల్లో 11 విజయాలు, 7 ఓటములు 2 టైలతో తెలుగు టైటాన్స్ కంటే ముందంజలో ఉంది. ఆ జట్టు తమ చివరి రెండు మ్యాచ్ల్లో భారీ తేడాతో ఓటమిపాలైతే తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరుతోంది. అద్భుతం జరిగితే తప్పా తెలుగు టైటాన్స్ ప్లే ఆఫ్స్ చేరదు.
ప్లే ఆఫ్స్కు జైపూర్..
మరో మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 31-28 తేడాతో బెంగాల్ వారియర్స్ను చిత్తు చేసింది. ఈ గెలుపుతో జైపూర్ ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకుంది. అర్జున్ దేశ్వాల్(9) జైపూర్ విజయంలో కీలక పాత్ర పోషించాడు.
పీకేఎల్ ఫ్లే ఆఫ్స్ ఫార్మాట్ ఏంటంటే..?
ఇతర టోర్నీలతో పోల్చితే ప్రోకబడ్డీ లీగ్ ప్లే ఆఫ్స్ ఫార్మాట్ విభిన్నంగా ఉంటుంది. ఈ టోర్నీలో మొత్తం 6 జట్లు ప్లే ఆఫ్స్ చేరుతాయి. టాప్-2లో నిలిచిన జట్లు నేరుగా సెమీఫైనల్-1 ఆడనుండగా.. తర్వాతి నాలుగు జట్లు ఎలిమినేటర్-1, ఎలిమినేటర్-2 మ్యాచ్లు ఆడుతాయి. ఈ రెండు మ్యాచ్ల్లో గెలిచిన జట్లు సెమీఫైనల్-2 ఆడుతాయి. సెమీఫైనల్-1, సెమీఫైనల్-2లో గెలిచిన జట్లు ఫైనల్ ఆడుతాయి.
టేబుల్ టాపర్గా హర్యానా స్టీలర్స్, రన్నరప్గా పట్నా పైరేట్స్ ప్లే ఆఫ్స్ బెర్త్ను దక్కించుకున్నాయి. యూపీ యోధాస్, దబాంగ్ ఢిల్లీ, జైపూర్ పింక్ పాంథర్స్ నాలుగు, ఐదు, స్థానాల్లో నిలిచి ప్లేఆఫ్స్కు అర్హత సాధించాయి. ఆరో స్థానం కోసం యు ముంబా, తెలుగు టైటాన్స్ మధ్య పోటీ నెలకొంది. యు ముంబా తమ తదుపరి రెండు మ్యాచ్ల్లో ఒక్కటి డ్రా చేసుకున్నా ప్లే ఆఫ్స్ బెర్త్ దక్కుతుంది.