ప్రోకబడ్డీ సీజన్ 11లో బెంగళూరు బుల్స్, గుజరాత్ జెయింట్స్ మధ్య ఉత్కంఠగా సాగిన మ్యాచ్.. చివరకు ఫలితం తేలకుండానే ముగిసింది. వరుసగా నాలుగు ఓటముల తర్వాత బెంగళూరు బుల్స్.. ఎట్టకేలకు ఓ పాయింట్ను ఖాతాలో వేసుకుంది. మంగళవారం జరిగిన పోరులో బెంగళూరు బుల్స్ 34-34తో గుజరాత్ జెయింట్స్తో టై చేసుకుంది.
ఈ మ్యాచ్ ఆరంభంలో గుజరాత్ దూకుడుగా ఆడింది. వరుస పాయింట్స్తో దుమ్మురేపింది. కానీ బెంగళూరు బుల్స్ కూడా ధీటుగా బదులిచ్చింది. ఆ జట్టు ఆటగాళ్లు నితిన్ రావల్, భగవాల్, ప్రతీక్ సత్తా చాటడంతో ఫస్టాఫ్ ముగిసే సమయానికి బెంగళూరు బుల్స్ 15-13తో రెండు పాయింట్ల ఆధిక్యం సాధించింది.

విరామం తర్వాత గుజరాత్ జూలు విధల్చడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది. నువ్వా-నేనా అన్నట్లు ఇరు జట్ల ఆటగాళ్లు మైదానంలో తొడ కొట్టారు. రైడింగ్లో సత్తా చాటిన గుజరాత్ టైటాన్స్.. బెంగళూరు విజయాన్ని అడ్డుకుంది.
ముఖ్యంగా రాకేష్ 7 రైడింగ్ పాయింట్స్తో గుజరాత్ ఓటమిని తప్పించాడు. బెంగళూరు కూడా గట్టిగా పోరాడటంతో ఈ మ్యాచ్ టైగా ముగిసింది. బెంగళూరు బుల్స్ తరఫున నితిన్(7), ప్రదీప్(6) టాప్ స్కోరర్లుగా నిలవగా.. గుజరాత్ తరఫున రాకేష్తో పాటు నీరజ్ కుమార్(5) సత్తా చాటారు.

యు ముంబా ఘన విజయం..
మరో మ్యాచ్లో యు ముంబా 43-29తో పుణెరి పల్టాన్ను చిత్తు చేసింది. అజిత్ చౌహాన్(12) యు ముంబా విజయంలో కీలక పాత్ర పోషించాడు. మ్యాచ్ ఆరంభంలో పుణెరి పల్టాన్ అద్భుత ప్రదర్శన కనబర్చింది. యు ముంబాను ఒకసారి ఆలౌట్ చేసి 19-16 పాయింట్లతో ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండాఫ్లో ఆ జట్టు పూర్తిగా తేలిపోయింది.
జూలు విధిల్చిన యు ముంబా రైడింగ్, ట్యాక్లింగ్లో దుమ్మురేపింది. దాంతో పుణేరి పల్టాన్ రెండు సార్లు ఆలౌటైంది. అజిత్ చౌహన్(12), సోబిర్(5) అసాధారణ ప్రదర్శనతో యుముంబా విజయంలో కీలక పాత్ర పోషించాడు. పుణేరి పల్టాన్ తరఫున పంకజ్ మోహితే(9) రాణించాడు.