ప్రోకబడ్డి ప్రీమియర్ లీగ్(పీకేఎల్) 11వ సీజన్లో బెంగళూరు బుల్స్కు మరో పరాజయం ఎదురైంది. మంగళవారం జరిగిన మ్యాచ్లో జైపూర్ పింక్ పాంథర్స్ 39-32 తేడాతో బెంగళూరు బుల్స్ను ఓడించింది. జైపూర్ పింక్ పాంథర్స్ కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ 19 పాయింట్లతో సత్తా చాటడంతో గెలవాల్సిన మ్యాచ్లో బెంగళూరు బుల్స్ ఓటమిపాలైంది.
మ్యాచ్ ఆరంభం నుంచి అద్భుతంగా ఆడిన బెంగళూరు బుల్స్.. ఫస్టాఫ్లో పూర్తి ఆధిపత్యం చెలాయించింది. రైడింగ్, ట్యాక్లింగ్లో సత్తా చాటి జైపూర్ పింక్ పాంథర్స్ను ఆలౌట్ కూడా చేసింది. దాంతో ఫస్టాఫ్ ముగిసే సమాయానికి బెంగళూరు 19-17 పాయింట్స్తో ఆధిక్యంలో నిలిచింది. కానీ సెకండాఫ్లో జైపూర్ పింక్ పాంథర్స్ దుమ్మురేపింది.

కెప్టెన్ అర్జున్ దేశ్వాల్ అద్భుత ప్రదర్శనతో వరుస పాయింట్లు సాధించింది. బెంగళూరు రైడర్ల దూకుడును క్యాష్ చేసుకున్న జైపూర్.. సూపర్ ట్యాక్లింగ్తో ఆ జట్టును ఆలౌట్ చేసింది. మరోవైపు బెంగళూరు అనవసర తప్పిదాలతో పాటు దూకుడైన ట్యాక్లింగ్, రైడింగ్తో మూల్యం చెల్లించుకొని ఓటమిపాలైంది. బెంగళూరు తరఫున అజింక్యా పవర్ ఒక్కడే 9 పాయింట్స్తో రాణించాడు.
ఈ మ్యాచ్లో ఇరు జట్లు 40 సార్లు రైడింగ్కు వెళ్లగా.. జైపూర్ 18 సార్లు సక్సెస్ అయ్యింది. బెంగళూరు మాత్రం 14 సార్లే పాయింట్స్ తీసుకొచ్చింది. బెంగళూరు ఖాతాలో ఒక సూపర్ రైడ్ కూడా ఉంది. ట్యాక్లింగ్లోనూ జైపూర్ జోరు కనబర్చింది. 30 ప్రయత్నాల్లో 14 సార్లు సక్సెస్ అయ్యింది. బెంగళూరు మాత్రం 18 ప్రయత్నాల్లో 6 సార్లు మాత్రమే ప్రత్యర్థి ఆటగాళ్లను పట్టుకుంది.
ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడిన జైపూర్ పింక్ పాంథర్స్ నాలుగు విజయాలతో ఆరో స్థానంలో కొనసాగుతుండగా.. బెంగళూరు బుల్స్ 7 పరాజయాలతో 11వ స్థానంలో నిలిచింది.