న్యూఢిల్లీ: ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ 2023 టోర్నీలో భారత జట్టు విజేతగా నిలిచింది. కొరియాలోని బూసన్ వేదికగా జరిగిన ఈ టోర్నీ ఫైనల్లో భారత్ 43-33 తేడాతో ఇరాన్ను చిత్తు చేసింది. భారత కెప్టెన్ పవన్ సెహ్రావత్ 16 పాయింట్లతో జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. ఏకపక్షంగా సాగిన ఈ మ్యాచ్లో ఆరంభం నుంచి భారత్ ఆధిపత్యం చెలాయించింది.
భారత రైడర్లు, డిఫెండర్లు సత్తా చాటడంతో ఫస్టాఫ్ ముగిసేసరికి 19-9తో 10 పాయింట్స్ లీడ్లో నిలిచింది. సెకండాఫ్లో ఇరాన్ ప్రతిఘటించడంతో మ్యాచ్ హోరాహోరీగా సాగింది. భారత డిఫెండర్ల తప్పిదాలతో ఓ దశలో 32-29తో భారత్ లీడ్ తగ్గింది. మ్యాచ్ మరో 30 సెకన్లలో ముగుస్తుందనగా సూపర్ ట్యాకిల్ చేసిన టీమిండియా.. ఇరాన్ను ఆలౌట్ చేసి 5 పాయింట్లు సాధించింది.

ఆ తర్వాత భారత స్టార్ రైడర్ అర్జున్ దేశమన్ సూపర్ రైడ్తో రెండు పాయింట్లు తీసుకురావడంతో భారత్ 10 పాయింట్ల తేడాతో ఘన విజయాన్ని అందుకుంది. ఈ టోర్నీలో భారత్ ఒక్క మ్యాచ్ కూడా ఓడకుండా వరుస విజయాలతో ఛాంపియన్గా నిలిచింది. మరోవైపు ఇరాన్ కూడా వరుస విజయాలతో ఫైనల్ చేరినా.. భారత్ చేతిలో ఖంగుతిన్నది.
అంతకుముందు భారత్ 62-17 తేడాతో జపాన్ను ఓడించింది. 76-13 తేడాతో కొరియాను చిత్తు చేసింది. 53-19 తేడాతో చైనీస్ తైపాయ్ను మట్టికరిపించింది. ఇక భారత జట్టుకు ఇది 8వ ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ టైటిల్ కావడం విశేషం.
ఇప్పటి వరకు 9 సార్లు ఈ టోర్నీని నిర్వహించగా 2003లో ఇరాన్ ఈ విజేతగా నిలిచింది. ఆ సీజన్లో భారత కబడ్డీ జట్టు పాల్గొనలేదు. బరిలోకి దిగిన మిగిలిన 8 సార్లు భారత కబడ్డీ జట్టే ఛాంపియన్గా నిలిచింది. 2005, 2017 సీజన్లలో ఏషియన్ కబడ్డీ ఛాంపియన్షిప్ల్లో ఫైనల్ చేరి, టీమిండియా చేతుల్లో ఓడిన పాకిస్థాన్.. వీసా సమస్యలతో ఈ సారి పాల్గొనలేదు.