అమ్స్టల్వీన్ (నెదర్లాండ్స్): మహిళల హాకీ ప్రపంచకప్లో భారత్ వరుసగా రెండో మ్యాచ్నూ 'డ్రా'గా ముగించింది. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో చైనా జట్టుతో మంగళవారం జరిగిన పూల్ 'బి' లీగ్ మ్యాచ్ను భారత్ 1-1తో 'డ్రా' చేసుకుంది. చైనా తరఫున జియాలి జెంగ్ (26వ నిమిషంలో) గోల్ చేయగా... 45వ నిమిషంలో వందన కటారియా గోల్తో భారత్ స్కోరును సమం చేసింది.
ఆరంభం నుంచి బంతి ఎక్కువసేపు భారత్ నియంత్రణలోనే ఉన్నప్పటికీ.. తొలి గోల్ చైనా ఖాతాలో చేరింది. 26వ నిమిషంలో చైనా ప్లేయర్ జాంగ్ జిన్దాన్ తొలి గోల్ సాధించింది. అక్కడ నుంచి స్కోరు సమం చేయడానికి భారత్ దాడులు పెంచింది. ఈ క్రమంలో లభించిన పలు పెనాల్టీ కార్నర్లను భారత అమ్మాయిలు గోల్గా మలచలేకపోయారు. 23వ నిమిషంలో బంతిని గోల్ పోస్ట్లోకి పంపించినా రిఫరల్ తిరస్కరించాడు. 42వ నిమిషంలో ఇండియాకు బ్యాక్ టు బ్యాక్ పెనాల్నీ కార్నర్లు లభించగా భారత అమ్మాయిలు రెండింటిని చేజార్చుకున్నారు.
మరికొద్దిసేపట్లో మూడో క్వార్టర్ ముగుస్తుందనగా 45వ నిమిషంలో మన జట్టు శ్రమ ఫలించింది. పెనాల్టీ కార్నర్ను సద్వినియోగం చేస్తూ వందన జట్టుకు గోల్ అందించింది. గురువారం జరిగే లీగ్ ఆఖరి పోరులో న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఇప్పటిదాకా రెండు మ్యాచ్లు ఆడిన భారత్ 2 పాయింట్లతో రెండో స్థానంలో ఉంది. ఇక అన్నే పాయింట్లతో చైనా అగ్రస్థానంలో కొనసాగుతోంది.
తొలి మ్యాచ్లో ఒలింపిక్ కాంస్య పతక విజేత ఇంగ్లండ్తో భారత్ 1-1తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ ఆరంభంలో వెనుకబడినా తర్వాత పుంజుకుని డ్రా చేసుకుంది. ఈ పోరులో బాగానే ఆడినా ఆఖర్లో భారత్ పలు గోల్ అవకాశాలను వృథా చేసింది. మ్యాచ్లో ఏడు పెనాల్టీ కార్నర్లలో ఒక్క దాన్నే గోల్గా మలచగలిగింది. ఇంగ్లండ్తో మ్యాచ్ భారత్ డిఫెన్స్ లోపాలను కూడా బయటపెట్టింది. కెప్టెన్, గోల్కీపర్ సవిత పూనియా తన వంతుగా రాణిస్తున్నా.. డిఫెండర్లు ఆమెకు మద్దతుగా నిలవాల్సి ఉంది. అయితే చెనాతో పోరులో భారత్ ఈ సమస్యను అధిగమించింది.