
అమ్స్టల్వీన్: ప్రతిష్టాత్మక మహిళల హాకీ ప్రపంచకప్లో భారత జట్టు కీలక పోరుకు సిద్దమైంది. నెదర్లాండ్స్ వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో పూల్-బిలో భాగంగా నేడు(గురువారం) పటిష్టమైన న్యూజిలాండ్తో భారత్ తలపడనుంది. ఇప్పటివరకు నిరాశజనక ప్రదర్శనతో వరుసగా రెండు మ్యాచ్లను డ్రా చేసుకున్న భారత జట్టు జూలు విదిల్చాల్సిన సమయం ఆసన్నమైంది. ఇంగ్లండ్, చైనాలతో మ్యాచ్లను డ్రాగా ముగించిన గోల్కీపర్ సవితా పూనియా కెప్టెన్సీలో భారత్.. నేరుగా క్వార్టర్స్లో బెర్తు దక్కించుకోవాలంటే న్యూజిలాండ్పై గెలవాల్సిందే.
ఈ నేపథ్యంలో మన జట్టు అన్ని విభాగాల్లోనూ పూర్తిస్థాయి ప్రదర్శన కనబరచాల్సిన అవసరం ఉంది. ప్రస్తుతం పూల్- బి లో భారత్ రెండు పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. న్యూజిలాండ్ (4), చైనా (2) వరుసగా తొలి రెండు స్థానాల్లో కొనసాగుతున్నాయి. ఒక్కో పూల్లో అగ్రస్థానంలో నిలిచిన జట్టు నేరుగా క్వార్టర్స్ చేరుతుంది. రెండు, మూడు స్థానాలు దక్కించుకున్న జట్లు.. ముందంజ వేయాలంటే క్రాస్ఓవర్స్లో ఇతర పూల్లోని జట్లతో తలపడాలి. ఇప్పుడు పూల్లో తన చివరి మ్యాచ్లో న్యూజిలాండ్పై భారత్ గెలిచి.. మరోవైపు ఇంగ్లాండ్తో చైనా ఓడిపోయినా లేదా డ్రా చేసుకున్నా మన జట్టు అగ్రస్థానంతో నేరుగా క్వార్టర్స్కు అర్హత సాధిస్తుంది. ఈ మ్యాచ్లో ఓడితే మాత్రం భారత్ టైటిల్ అవకాశాలు గల్లంతవుతాయి.
చైనా జట్టుతో మంగళవారం జరిగిన పూల్ 'బి' లీగ్ మ్యాచ్ను భారత్ 1-1తో 'డ్రా' చేసుకుంది. చైనా తరఫున జియాలి జెంగ్ (26వ నిమిషంలో) గోల్ చేయగా... 45వ నిమిషంలో వందన కటారియా గోల్తో భారత్ స్కోరును సమం చేసింది. తొలి మ్యాచ్లో ఒలింపిక్ కాంస్య పతక విజేత ఇంగ్లండ్తో భారత్ 1-1తో డ్రా చేసుకుంది. ఈ మ్యాచ్ ఆరంభంలో వెనుకబడినా తర్వాత పుంజుకుని డ్రా చేసుకుంది. ఈ రెండు మ్యాచ్ల్లో భారత్ డిఫెన్స్ లోపాలు బయటపడ్డాయి. కెప్టెన్, గోల్కీపర్ సవిత పూనియా తన వంతుగా రాణిస్తున్నా.. డిఫెండర్లు ఆమెకు మద్దతుగా నిలవాల్సి ఉంది.