అమ్స్టల్వీన్: ప్రతిష్టాత్మక మహిళల హాకీ ప్రపంచకప్ 2022 టోర్నీ నుంచి భారత జట్టు నిష్క్రమించింది. ఎన్నో అంచనాల మధ్య బరిలోకి దిగిన భారత అమ్మాయిలు అనవసర తప్పిదాలతో టోర్నీలో ముందడుగు వేయలేకపోయారు. దాంతో ప్రపంచకప్ సాధించాలని భావించిన అమ్మాయిల జట్టుకు మరోసారి నిరాశ తప్పలేదు. టోక్యో ఒలింపిక్స్లో సంచలన ప్రదర్శనతో నాలుగో స్థానం చేరిన భారత్.. ప్రపంచకప్లో సత్తా చాటుతుందని భావించిన అభిమానులకు నిరాశే ఎదురైంది. నెదర్లాండ్ వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో భారత్ లీగ్ దశకే పరిమితమైంది.
ఆతిథ్య స్పెయిన్తో జరిగిన కీలక మ్యాచ్ లో భారత్ 0-1 తో ఓటమిపాలైంది. చివరి నిమిషం వరకు నువ్వా నేనా అన్నట్టుగా సాగిన ఈ మ్యాచ్ లో గెలిచిన స్పెయిన్ క్వార్టర్స్కు చేరింది. ప్రపంచకప్ క్వార్టర్స్ ఫైనల్స్కు వెళ్లాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో సవిత పునియా సారథ్యంలోని భారత అమ్మాయిలు తీవ్రంగా నిరాశపరిచారు. తొలి అర్థ భాగంలో బాగానే ఆడిన అమ్మాయిలు తర్వాత స్పెయిన్ డిఫెన్స్ను అడ్డుకున్నా చివరి క్షణాల్లో తడబడి మ్యాచ్ను చేజార్చుకున్నారు.
తొలి అర్థభాగంలో ఇరు జట్లు గోల్స్ ఏం చేయలేదు. కానీ రెండో అర్థ భాగంలో మ్యాచ్ మరికొద్దిసేపట్లో ముగుస్తుందనగా.. స్పెయిన్ ప్లేయర్ మార్టా సెగు క్లారా కార్ట్ ఇచ్చిన బంతిని నేరుగా గోల్ పోస్ట్ లోకి పంపింది. ఆ తర్వాత భారత్ చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. భారత్ గోల్ ప్రయత్నాలను స్పెయిన్ డిఫెండర్లు అడ్డుకున్నారు. దాంతో భారత్ ఓటమిపాలైంది.
ప్రపంచకప్ ఆశలు చెదిరిపోవడంతో భారత జట్టు.. 9-16 స్థానాల మధ్య జరిగే పోరులో తమ తదుపరి మ్యాచ్ను కెనడాతో ఆడనుంది. జులై 12 న ఈ మ్యాచ్ జరుగుతుంది. ప్రస్తుతానికి న్యూజిలాండ్, జర్మనీ, నెదర్లాండ్స్, బెల్జియం, ఆస్ట్రేలియా, స్పెయిన్, అర్జెంటీనా, ఇంగ్లండ్ జట్లు క్వార్టర్ ఫైనల్కు చేరుకున్నాయి. మంగళవారం నుంచి క్వార్టర్స్ మ్యాచ్లు ప్రారంభమవుతాయి. జులై 16, 17 న సెమీస్.. 18న ఫైనల్ జరగనుంది.