మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో భారత్ వరుసగా రెండో విజయాన్ని నమోదు చేసింది. మంగళవారం ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో 3-2 తేడాతో సౌత్ కొరియాను ఓడించింది. ఆఖరి క్షణం వరకు ఉత్కంఠగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ అసాధారణ ప్రదర్శనతో గెలుపొందింది. స్ట్రైకర్ దీపిక రెండు గోల్స్(20వ నిమిషం, 57వ నిమిషంలో)తో భారత విజయంలో కీలక పాత్ర పోషించింది.
మ్యాచ్ ఆరంభం నుంచి దూకుడు కనబర్చిన భారత్.. మూడో నిమిషంలోనే సంగీత కుమారి గోల్తో ఆధిక్యంలోకి వెళ్లింది. సెకండ్ క్వార్టర్స్లో దీపిక బంతిని అద్భుతంగా గోల్ పోస్ట్లోకి పంపి భారత్ ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేసింది. ఆ తర్వాత కొరియా పుంజుకుంది. బంతిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ భారత రక్ష శ్రేణిని ముప్పు తిప్పలు పెట్టింది.

పదే పదే భారత గోల్ పోస్ట్పై దాడులు చేసింది. ఈ క్రమంలో ఆ జట్టుకు మూడో క్వార్టర్లో వరుసగా రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. ఈ రెండింటి యూరీ లీ(34వ నిమిషం), కెప్టెన్ చెయాన్(38వ నిమిషం) గోల్స్గా నమోదు చేసి స్కోర్ను 2-2తో సమం చేశారు. ఆ తర్వాత చాలా సేపటి వరకు ఇరు జట్లు గోల్స్ నమోదు చేయలేకపోయాయి. దాంతో ఈ మ్యాచ్ డ్రాగా ముగుస్తుందని అంతా అనుకున్నారు.
కానీ మరో మూడు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. భారత స్ట్రైకర్ దీపిక.. పెనాల్టీ స్ట్రోక్ను గోల్గా మలిచి ఆధిక్యాన్ని అందించింది. చివరి వరకు ఈ ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్ విజయలాంఛనాన్ని పూర్తి చేసింది. తొలి మ్యాచ్లో భారత్ 4-0తో మలేసియాను ఓడించింది.