మహిళల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ టీమ్ శుభారంభం చేసింది. బీహార్లోని రాజ్గిర్ వేదికగా సోమవారం జరిగిన ఈ మ్యాచ్లో డిఫెండింగ్ ఛాంపియన్ భారత్ 4-0 తేడాతో మలేసియాను చిత్తు చేసింది. భారత తరఫున సంగీత(8వ, 55వ నిమిషాల్లో) రెండు గోల్స్ సాధించగా.. ప్రీతి దూబే(43వ నిమిషం), ఉదిత(44వ నిమిషం) చెరో గోల్ నమోదు చేశారు. మలేసియా ఒక్క గోల్ కూడా నమోదు చేయలేకపోయింది.
ఈ మ్యాచ్ ఆరంభంలో మలేసియా కాస్త జోరు కనబర్చింది. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని భారత గోల్ పోస్ట్పై దాడులు చేసింది. ఆట ఐదో నిమిషంలోనే ఆ జట్టుకు పెనాల్టీ కార్నర్ లభించగా.. భారత రక్షణ శ్రేణి అడ్డుకుంది. ఆ తర్వాతి నుంచి భారత్ వేగం పెంచింది. బంతిని తమ ఆధీనంలో ఉంచుకొని ప్రత్యర్థి డిఫెన్స్ను ఛేదిస్తూ గోల్ పోస్ట్పైకి దాడులు చేసింది.

దాంతో రెండు నిమిషాల వ్యవధిలోనే భారత్కు రెండు పెనాల్టీ కార్నర్లు లభించాయి. మొదటిది వృథా కాగా.. రెండో పీసీని సంగీత గోల్గా మలిచి భారత్ ఖాతా తెరిచింది. ఆ తర్వాత ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. దాంతో మరో 35 నిమిషాల వరకు ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. మధ్యలో పెనాల్టీ కార్నర్లు లభించినా.. భారత్ సద్వినియోగం చేసుకోలేకపోయింది. గోల్ ప్రయత్నాలు కూడా విఫలమయ్యాయి.
మూడో క్వార్డర్ చివర్లో ప్రీతి అద్భుతమైన రీతిలో గోల్ సాధించి భారత్ ఆధిక్యాన్ని డబుల్ చేసింది. ఆ వెంటనే పెనాల్టీ కార్నర్ను ఉదిత గోల్గా మలిచింది. దాంతో నిమిషం వ్యవధిలోనే భారత్ ఖాతాలో రెండు గోల్స్ వచ్చి చేరాయి. ఆఖరి క్వార్టర్ చివర్లో సంగీత అద్భుతమైన ఫీల్డ్ గోల్తో భారత్ ఆధిక్యాన్ని నాలుగింతలు చేసి విజయాన్ని ఖాయం చేసింది. మంగళవారం జరిగే తమ తదుపరి మ్యాచ్లో భారత్.. సౌత్ కొరియాతో తలపడనుంది.