జూనియర్ హాకీ టోర్నీ సుల్తాన్ ఆఫ్ జోహర్ కప్ 2025లో భారత్కు మరో పరాజయం ఎదురైంది. బుధవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత జూనియర్ హాకీ టీమ్ 2-4 తేడాతో ఓటమిపాలైంది. మలేసియా వేదికగా జరుగుతున్న ఈ టోర్నీలో టీమిండియాకు ఇది రెండో పరాజయం.
భారత్ తరఫున కెప్టెన్ రోహిత్(22వ నిమిషం), అర్ష్దీప్ సింగ్(60వ నిమిషం) గోల్స్ చేశారు. ఆస్ట్రేలియా తరఫున ఆస్కార్ స్ప్రౌల్ (39వ నిమిషం, 42వ నిమిషం), ఆండ్రూ పాట్రిక్ (40వ నిమిషం), కెప్టెన్ డిలన్ డౌనీ (51వ నిమిషం) గోల్స్ సాధించారు.
మ్యాచ్ తొలి క్వార్టర్లో ఇరు జట్లు హోరాహోరీగా తలపడటంతో ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు. రెండో క్వార్టర్ ప్రారంభమైన కాసేపటికే టీమిండియాకు పెనాల్టీ కార్నర్ లభించింది. ఈ అవకాశాన్ని భారత కెప్టెన్ రోహిత్ గోల్గా మలిచాడు. ఆ వెంటనే 25వ నిమిషంలో అమిర్ అలీ గోల్ కోసం ప్రయత్నం చేయగా.. ఆస్ట్రేలియా గోల్ కీపర్ అడ్డుకున్నాడు. మూడో క్వార్టర్లో ఆసీస్ వరుగా మూడు గోల్స్ నమోదు చేసి పైచేయి సాధించింది.

39వ నిమిషంలో అద్భుతమైన మూవ్తో ఆస్కార్ స్ప్రౌల్ బంతిని గోల్ పోస్ట్లోకి పంపాడు. 40వ నిమిషంలో ఆండ్రూ పాట్రిక్ గోల్ కోట్టగా.. మరో రెండు నిమిషాల వ్యవధిలోనే మరో గోల్ కొట్టిన ఆస్కార్ ఆసీస్ ఆధిక్యాన్ని మూడింతలు చేశాడు. ఆఖరి క్వార్టర్లో డిలన్ డౌనీ గోల్ కొట్టి విజయాన్ని ఖాయం చేశాడు. మ్యాచ్ చివరి నిమిషంలో అర్ష్దీప్ సింగ్ గోల్ చేసినా ఫలితం లేకపోయింది.
భారత్ తమ తదుపరి మ్యాచ్ను శుక్రవారం ఆతిథ్య మలేసియాతో ఆడనుంది. పాయింట్స్ టేబుల్లో భారత్ రెండు విజయాలు రెండు ఓటములతో రెండో స్థానంలో కొనసాగుతుండగా.. ఆస్ట్రేలియా 3 విజయాలు ఒక డ్రాతో అగ్రస్థానంలో ఉంది. ఆస్ట్రేలియా, భారత్తో పాటు గ్రేట్ బ్రిటన్, పాకిస్థాన్, మలేసియా, న్యూజిలాండ్ జట్లు ఈ టోర్నీలో ఆడుతున్నాయి.