పీఆర్ శ్రీజేష్.. పరిచయం అక్కర్లేని పేరు. కోట్లాది దేశ ప్రజల అంచనాల భారాన్ని మోస్తూ.. గోల్పోస్ట్ ముందు అడ్డుగోడలా నిలబడి ఒలింపిక్స్లో భారత్కు వరుసగా రెండు కాంస్య పతకాలు దక్కేలా కీలక పాత్ర పోషించిన దిగ్గజ హాకీ ఆటగాడు. పారిస్ ఒలింపిక్స్ 2024లో జట్టును కాంస్య విజేతగా నిలబెట్టిన ఈ గోల్కీపర్ ఆ మరుక్షణమే తన సుదీర్ఘ కెరీర్కు వీడ్కోలు పలికాడు.
పారిస్తో పాటు టోక్యో ఒలింపిక్స్లోనూ భారత్ కాంస్య పతకాలు సాధించడంలో గోల్ కీపర్గా శ్రీజేష్ కీలక పాత్ర పోషించాడు. గోల్ పోస్ట్కు అడ్డుగోడలా నిలబడి ప్రత్యర్థి గోల్స్ ప్రయత్నాలను అడ్డుకున్నాడు. గ్రేట్ బ్రిటన్తో జరిగిన క్వార్టర్ ఫైనల్లో పీఆర్ శ్రీజేష్ కనబర్చిన పోరాటం అతని కెరీర్కే హైలైట్. దాదాపు 13 గోల్స్ ప్రయత్నాలను అతను అడ్డుకున్నాడు.

నా విలనే.. నా సతీమణి!
మైదానంలో ప్రత్యర్థి గోల్స్ను అడ్డుకునే శ్రీజేష్.. వ్యక్తిగత జీవతంలో తన భార్య అనీష్య చేసిన ప్రేమ గోల్కు మాత్రం పడిపోయాడు. ద్వేషంతో మొదలైన తమ ప్రేమ.. వివాహ బంధంగా మారిందని తమ లవ్స్టోరీని తాజా చెప్పుకొచ్చాడు. కేరళలోని కన్నూర్లో ఉన్న జీవీఎన్ స్పోర్ట్స్ స్కూల్లో శ్రీజేష్, అనీష్య చదువుకున్నారు.
శ్రీజేష్ ముందు నుంచి అదే పాఠశాల్లో చదవగా... అనీష్య మధ్యలో వచ్చింది. ఆమె రాకతో అప్పటి వరకు టాపర్గా కొనసాగిన శ్రీజేష్ సెకండ్ ప్లేస్కు పడిపోయాడు. దాంతో లాంగ్ జంప్ అథ్లెట్ అయిన అనీష్యపై శ్రీజేష్ కోపంతో ఉండేవాడు.
అనీష్య అంటే ద్వేషం..
'అనీష్యా వచ్చే వరకు మా స్కూల్లో నేనే టాపర్. సూపర్ స్టార్లా ఉండేవాడిని. కానీ అనీష్యా రాకతో అంతా మారిపోయింది. అన్నింట్లో ఆమె నాకంటే ముందుండేది. దీంతో ఆమెపై మొదట ద్వేషం కలిగింది. మేం ఇద్దరం శత్రువులుగా ఉండేవాళ్లం. కానీ చివరకు అదే మా మధ్య ప్రేమను చిగురించేలా చేసింది.'అని శ్రీజేష్ చెప్పుకొచ్చాడు.
శ్రీజేష్, అనీష్యల వివాహం 2013లో జరిగింది. ప్రస్తుతం ఆమె ఆయుర్వేద వైద్యురాలిగా పనిచేస్తోంది. మంచి ఉద్యోగం తెచ్చుకోవాలనే లక్ష్యంతోనే హాకీ కెరీర్ ప్రారంభించానని శ్రీజేష్ తెలిపాడు. పారిస్ ఒలింపిక్స్లో భార్య పిల్లల పేర్లతో కూడిన హాకీ స్టిక్స్ ఉపయోగించినట్లు తెలిపాడు.
కుటుంబ సభ్యులతో పేర్లతో హాకీ స్టిక్స్
'పిల్లలిద్దరూ నా రెండు కళ్లు. ఇందులో ఏది ఇష్టమో చెప్పలేం. కానీ మనకు ఒకటే హృదయం ఉంటుంది. అది నా సతీమణి. మ్యాచ్లో స్టిక్స్ మార్చుకోవడానికి కుదురుతోంది. అందుకే నా తనయుడు, కూతురు పేర్లతో ఉన్న స్టిక్స్ను ఉపయోగించాను. కానీ షూటౌట్లో ఒకటే స్టిక్ ఉపయోగించాలి. అప్పుడు నా సతీమణి పేరుతో ఉన్న స్టిక్ ఉపయోగించాను. నా పిల్లలకు నా పేరు భారం కాకుడదనుకుంటున్నా. వాళ్లను స్వేచ్చగా వదిలేస్తాను.'అని శ్రీజేష్ చెప్పుకొచ్చాడు.