
న్యూఢిల్లీ: భారత హాకీ దిగ్గజం, ఒలింపిక్ విజేత వారీందర్ సింగ్(75) మరణించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన స్వస్థలం జలంధర్లో మంగళవారం ఉదయం తుదిశ్వాస విడిచారు. వారీందర్ సింగ్ మరణం పట్ల హాకీ ఇండియా సంతాపం వ్యక్తం చేసింది. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారీందర్ సింగ్ లేని లోటు పూడ్చలేనిదని, ఆయన కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని ఓ ప్రకటనను విడుదల చేసింది.
1947లో పంజాబ్లోని జలంధర్లో జన్మించిన వారీందర్ సింగ్ హాకీపై ఉన్న మక్కువతో చిన్నప్పటి నుంచే సాధన చేశారు అంచెలంచెలుగా ఎదుగుతూ భారత హాకీ జట్టులో చోటు సంపాదించారు. హాకీ వరల్డ్కప్-1975 టోర్నీలో పాకిస్తాన్ను 2-1 తేడాతో ఓడించి స్వర్ణ పతకం గెలిచిన భారత జట్టులో ఆయన సభ్యుడు.
అదే విధంగా... 1972 నాటి మ్యూనిచ్ ఒలంపిక్స్లో కాంస్య పతకం గెలిచిన భారత జట్టులో ఆయన భాగస్వామిగా ఉన్నారు. అంతేగాక 1973లో ప్రపంచకప్లో రజతం గెలిచిన జట్టులో సభ్యుడు. ఇక 1974, 1978 ఏసియన్ గేమ్స్లో రజతం గెలిచిన భారత జట్టుకు ఆయన ప్రాతినిథ్యం వహించారు. కాగా హాకీ ఆటగాడిగా క్రీడా రంగానికి చేసిన సేవకు గానూ 2007లో ప్రతిష్టాత్మక ధ్యాన్చంద్ జీవన సాఫల్య పురస్కారాన్ని వారీందర్ సింగ్ అందుకున్నారు.