Junior Hockey World Cup: జూనియర్ పురుషుల అండర్-21 హాకీ ప్రపంచకప్లో భారత్ శుభారంభం చేసింది. మూడో టైటిలే లక్ష్యంగా బరిలోకి దిగిన ఉత్తమ్ సింగ్ నాయకత్వంలోని భారత జట్టు.. మంగళవారం జరిగిన తొలి మ్యాచ్లో కొరియాను చిత్తు చేసింది. కౌలాలంపూర్లోని నేషనల్ హాకీ స్టేడియంలో హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో భారత్ 4-2 తేడాతో కొరియాను మట్టికరిపించింది.
భారత ఫార్వార్డ్ ప్లేయర్ అరైజీత్(11వ, 16వ, 41వ నిమిషం) హ్యాట్రిక్ గోల్స్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించాడు. అమన్దీప్(30వ నిమిషం) ఒక గోల్తో సత్తా చాటాడు. కొరియా జట్టులో దోహ్యూన్ లిమ్(38వ నిమిషం), మింక్వాన్ కిమ్(45వ నిమిషం) తలో గోల్తో రాణించారు.

ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే టీమిండియా ఆధిపత్యం చెలాయించింది. భారత ప్లేయర్లు బంతిపై పూర్తి ఆధిపత్యం చెలాయిస్తూ కొరియా ఢిఫెన్స్ ఛేదిస్తూ గోల్స్ సాధించారు. 11వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను అరైజీత్ గోల్గా మలిచి భారత్కు శుభారంభాన్ని అందించాడు. ఆ కొద్దిసేపటికే సహచర ఆటగాడు ఇచ్చిన పాస్ను చాకచక్యంగా గోల్పోస్ట్లోకి తరలించి భారత్ ఆధిక్యాన్ని 2-0తో డబుల్ చేశాడు.
సెకండాఫ్ గేమ్లోనూ ఇదే జోరును కొనసాగించిన భారత్.. ప్రత్యర్థిపై ఒత్తిడిని తీసుకొచ్చింది. 29వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను కొరియా గోల్గా మల్చుకోలేకపోయింది. కానీ మరుసటి క్షణమే అమన్దీప్ అద్భుతంగా గోల్ కొట్టి టీమిండియా ఆనందాన్ని 3-0తో మూడింతలు చేశాడు.
ఈ పరిస్థితుల్లో కొరియా ఆటగాళ్లు గట్టి పోటీనిచ్చారు. భారత డిఫెన్స్ చేధిస్తూ గోల్పోస్ట్లోకి పదే పదే దూసుకొచ్చారు. 38వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను దోహ్యూన్ లిమ్ గోల్గా మలిచి కొరియా ఖాతా తెరిచాడు. కానీ మూడు నిమిషాల వ్యవధిలోనే రివర్స్ ఫ్లిక్తో అరైజీత్ గోల్ కొట్టి హ్యాట్రిక్తో పాటు భారత్ లీడ్ను 4-1 గా మార్చాడు.

మరో మూడు నిమిషాల్లో మూడో క్వార్టర్ ముగుస్తుందనగా.. భారత్ 9 మంది ప్లేయర్లతో ఆడాల్సి వచ్చింది. ఇది కొరియాకు కలిసొచ్చింది. 45వ నిమిషంలో లభించిన పెనాల్టీ కార్నర్ను మింక్వాన్ కిమ్ గోల్గా మలిచి మ్యాచ్ను ఉత్కంఠగా మార్చాడు.
కానీ ఫైనల్ క్వార్టర్లో ఎలాంటి తప్పిదం చేయని భారత్ 4-2 ఆధిక్యాన్ని కాపాడుకొని విజయాన్ని అందుకుంది. చివరి క్వార్టర్లో ఇరు జట్లకు పెనాల్టీ కార్నర్స్ లభించినా.. గోల్స్గా మలచలేకపోయారు. భారత్ తమ తదుపరి మ్యాచ్ను గురువారం స్పెయిన్తో ఆడనుంది.