32 పతకాల్లో 12 హాకీవే..
హాకీ.. 'మన జాతీయ క్రీడ' అని పుస్తకాల్లో చదువుకోవడమే తప్పా దేశంలో ఆ ఆటను చూసింది.. ఆడింది మాత్రం చాలా తక్కువే. బేసిగ్గా హాకీ అనగానే మనకు బాగు గుర్తొచ్చే పేరు ధ్యాన్ చంద్. ఇంతకు మించీ సాధారణ ప్రజలకు.. కొంతమంది క్రీడాభిమానులకు హాకీ గురించి తెలిసింది చాలా తక్కువే. అసలు ఆట గురించి కూడా పెద్దగా ఎవరికీ తెలియదనేది జగమెరిగిన సత్యం. అంతా క్రికెట్ మత్తులో మునిగి తేలుతున్నారు. దాంతోనే ఇతర ఆటలన్నీ మరుగున పడ్డాయి. కానీ హాకీలో ఒకప్పుడు భారత్ కింగ్. అసలు ఒలింపిక్స్ చరిత్రలో భారత్ సాధించిన పతకాలే 32 అయితే అందులో 11 హాకీలోనే వచ్చాయి.
7 స్వర్ణాల టీమ్ క్వాలిఫై కాలేదు..
జైపాల్ సింగ్ ముండా, లాల్ షా బోఖారి, ధ్యాన్ చంద్, కిషన్లాల్, కేడీ సింగ్ వంటి దిగ్గజాల సారథ్యంలో భారత్ ఒలింపిక్స్లో వరుసగా ఆరు స్వర్ణాలు సాధించింది. ఒక రజతం, మళ్లీ స్వర్ణం, ఆపై రెండు వరుస కాంస్యాలు.. ఒక ఒలింపిక్స్ గ్యాప్(కెనడా ఒలింపిక్స్లో 7 స్థానం) తర్వాత మరో స్వర్ణం.. ఇదీ వరుస ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ టీం సాధించిన ట్రాక్ రికార్డు. అలాంటి పటిష్ట టీమ్ రాను రాను ఒలింపిక్స్ క్వాలిఫికేషన్స్ ఆడే పరిస్థితిని తెచ్చుకుంది. 1984 నుంచి వరుస ఒలింపిక్స్లో ఐదు, ఆరు, ఏడు, ఎనిమిది, పన్నెండు స్థానాల్లో కొనసాగుతున్న వచ్చిన భారత పురుషుల హాకీ టీం .. 2008 బీజింగ్ ఒలింపిక్స్కు క్వాలిఫై కూడా కాలేదు.
హాకీని తొక్కేసిన క్రికెట్..
దేశంలో హాకీ పతనానికి క్రికెట్ ఓ కారణమైతే.. ఆటలో రాజకీయాలు, అంతర్గత కుమ్ములాటలు మరో కారణం. నైపుణ్యం కలిగిన ఆటగాళ్లకు అవకాశం దక్కకపోవడం, రికమెండేషన్స్తో జట్టులోకి రావడం.. ప్రభుత్వ ఉద్యోగాల కోసం హాకీ ఆడటం వంటి పనులు భారత హాకీని దెబ్బ తీసాయి. తెరపైకి అప్పుడప్పుడు కొందరు హాకీ ప్లేయర్ల పేర్లు వచ్చినా, విజయాలు పలకరించినా.. అవి కేవలం వార్తలకే పరిమితమయ్యేవి. వీటికితోడు దేశంలో క్రికెట్కు పెరిగిన ఆదరణ.. ఐపీఎల్తో ఆ ఆటలో వచ్చిన మార్పులు.. హాకీని ఉత్త జాతీయ క్రీడగా మార్చేసాయి. వీటికి ప్రభుత్వాల అలసత్వం కూడా తోడైంది. ఎంతలా అంటే ఓ రెండు తరాలకు అసలు హాకీ ఆట అంటే ఏంటో కూడా తెలియని పరిస్థితి నెలకొంది. 1983 ప్రపంచకప్ విజయం తర్వాత భారత క్రికెట్ ఓ వెలుగు వెలిగితే హాకీ పతనం 1980 మాస్కో ఒలింపిక్స్ తర్వాత మొదలైంది. పెరిగిన నగర జనాభాతో మైదానాలు లేకపోవడం.. క్రికెట్ అయితే ఓ బ్యాట్, బంతి ఉంటే చాలు కానీ, హాకీ అయితే 11 మందికి బ్యాట్లు కావాలి.. ఇది కూడా హాకీ ఆటను మారుమూల పల్లెలకు తీసుకెళ్లలేకపోయింది.
టోక్యో బ్రాంజ్తోనైనా పరిస్థితి మారెనా?
ఈ కారణాలతోనే హాకీని కెరీర్గా తీసుకునే వారి సంఖ్య చాలా తగ్గింది. దాంతో టీమ్ ప్రదర్శన పేలవంగా మారింది. గత నలభై ఏళ్లలో లీగ్ టోర్నీలు, ఆసియన్ టోర్నీల్లో తప్పా.. ప్రపంచ కప్ల్లో(1975 తర్వాత), మిగతా టోర్నమెంట్లలో ఎక్కడా భారత హాకీ టీం హవా నడవలేదు. ఇప్పుడు నాలుగు దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా హాకీ దిగ్గజం గ్రాహం రెయిడ్ కోచింగ్లో రాటుదేలిన భారత హాకీ టీం.. ఎలాంటి అంచనాలు లేకుండానే బరిలోకి దిగి టోక్యో ఒలింపిక్స్లో క్వార్టర్స్లో బ్రిటన్ను ఓడించి పతక ఆశలు రెకేత్తించింది. సెమీఫైనల్లో వరల్డ్ చాంపియన్ బెల్జియంను ఓడించేంత పనిచేసింది. తాజా బ్రాంజ్ ఫైట్లోనూ అసాధారణ ఆటతో ఆకట్టుకొని కాంస్య పతకాన్ని ముద్దాడింది. పురుషుల ఆటకు తోడు అమ్మాయిలు సంచలన ప్రదర్శనతో చరిత్రలోనే తొలిసారి సెమీపైనల్లోకి దూసుకెళ్లారు. అబ్బాయిల తరహాలోనే సెమీఫైనల్లో ఓడినా.. బ్రాంజ్ మెడల్ కోసం గ్రేట్ బ్రిటన్తో అమీతుమీ తేల్చుకునేందుకు సిద్దమవుతున్నారు. వీరు కూడా కంచు మోగిస్తే భారత్ హాకీకి స్వర్ణ యుగం ప్రారంభమైనట్లే.! అలానే కావాలని మనమూ ఆశిద్దాం.!