భారత పురుషుల హాకీ జట్టు గోల్కీపర్, మాజీ కెప్టెన్ పీఆర్ శ్రీజేశ్ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. అప్కమింగ్ పారిస్ ఒలింపిక్స్ 2024 తర్వాత అంతర్జాతీయ కెరీర్కు వీడ్కోలు పలుకుతున్నట్లు ప్రకటించాడు. ఇప్పటికే మూడు సార్లు ఒలింపిక్స్ బరిలో నిలిచిన శ్రీజేశ్.. పారిస్ ఒలింపిక్స్లో మెరుగైన ప్రదర్శన చేసి కెరీర్కు గుడ్బై చెప్పాలనుకుంటున్నాడు.
'పారిస్ ఒలింపిక్స్తో నా కెరీర్కు వీడ్కోలు పలికేందుకు సిద్దమయ్యా. ఒలింపిక్స్ కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నా. నా కెరీర్కు అండగా నిలిచిన నా కుటుంబ సభ్యులు, సహచరులు, కోచ్లు, భారత హాకీ జట్టు అభిమానులకు ప్రత్యేక ధన్యవాదాలు. నాపై విశ్వాసం ఉంచిన అందరీకీ కృతజ్ఞతలు. నా సహచర ఆటగాళ్లు బాధ, సంతోష సమయాల్లో పక్కనే ఉన్నారు.

మేమందరం పారిస్ ఒలింపిక్స్లో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నిస్తాం. కచ్చితంగా మా పతకం రంగును మార్చాలనే లక్ష్యంతో ఉన్నాం.'అని పీఆర్ శ్రీజేశ్ పేర్కొన్నాడు.
2010 హాకీ ప్రపంచకప్తో కెరీర్ ప్రారంభించిన 36 ఏళ్ల శ్రీజేశ్.. ఇప్పటి వరకు 328 అంతర్జాతీయ మ్యాచ్లు ఆడి భారత్ సాధించిన ఎన్నో చిరస్మరణీయ విజయాల్లో భాగమయ్యాడు. టోక్యో ఒలింపిక్స్లో భారత పురుషుల హాకీ టీమ్ బ్రాంజ్ మెడల్ గెలిచిన విషయం తెలిసిందే. ఈ కాంస్య పతకం గెలవడంలో శ్రీజేశ్ కీలక పాత్ర పోషించాడు.
గోల్ పోస్ట్కు హీరోలా అడ్డుగా నిలిచి అనేక గోల్స్ ఆపాడు. జూలై 26 నుంచి ఆగస్ట్ 11 వరకు పారిస్ ఒలింపిక్స్ జరగనుండగా.. భారత్ హాకీ టీమ్ తొలి మ్యాచ్ను న్యూజిలాండ్తో జూలై 27న ఆడనుంది. అర్జెంటీనాతో జూలై 29న, బెల్జియంతో ఆగస్ట్ 1న, ఆస్ట్రేలియాతో ఆగస్ట్ 2న తలపడనుంది.