బెంగళూరు: కరోనా కట్టడి కోసం భారత మహిళల హాకీ జట్టు సహాయం అందించింది. 18 రోజుల పాటు ఫిట్నెస్ సవాళ్లతో సేకరించిన రూ.20 లక్షలను... కరోనా బాధితులకు సాయపడుతున్న ఢిల్లీకి చెందిన ఎన్జీఓ సంస్థ ఉదయ్ ఫౌండేషన్కు అందజేసింది. ఆ సంస్థ ఈ డబ్బును వలస కూలీలు, అనారోగ్య సమస్యలతో బాధపడుతోన్న వారి కోసం ఉపయోగించనుంది. విరాళాలు సేకరించడానికి భారత హాకీ ప్లేయర్లు రోజుకు ఒకరు చొప్పున సామాజిక మాధ్యమంలో ఒక ఫిట్నెస్ చాలెంజ్ను విసిరి... ఆ చాలెంజ్ను స్వీకరించవలసినదిగా 10 మందిని నామినేట్ చేసేవారు.
చాలెంజ్ను స్వీకరించిన ఆ పది మంది రూ.100 చొప్పున విరాళంగా ఇచ్చేవారు. అలా ఏప్రిల్ 17న మొదలైన ఈ చాలెంజ్ మే 3వ తేదీ వరకు సాగింది. 'మంచి పనిని ఆదరించడంతో పాటు అందులో భాగస్వామ్యం అయిన ప్రతి ఒక్కరికీ మహిళల హాకీ జట్టు తరఫున కృతజ్ఞతలు. మేం చేపట్టిన ఈ పనికి మాకు అద్భుతమైన మద్దతు లభించింది. ముఖ్యంగా ప్రపంచవ్యాప్తంగా ఉన్న భారత హాకీ ప్రేమికులు ఈ చాలెంజ్లో భాగస్వామ్యమై తమవంతు సాయాన్ని అందించారు,' అని జట్టు కెప్టెన్ రాణి రాంపాల్ పేర్కొంది.
యూవీ, భజ్జీ నా బెస్ట్ ఫ్రెండ్స్.. అవకాశమిస్తే టీమిండియాకు బౌలింగ్ కోచ్గా ఉంటా: అక్తర్