పురుషుల హాకీ ఆసియా కప్ 2025 టోర్నీ తొలి సూపర్-4 పోరులో భారత్ ఓటమి నుంచి గట్టెక్కింది. లీగ్ దశలో హ్యాట్రిక్ విజయాలతో జోరు కనబర్చిన భారత్కు సూపర్ -4లో మాత్రం గట్టి పోటీ ఎదురైంది. బిహార్లో రాజ్గిర్ వేదికగా సౌత్ కొరియాతో బుధవారం జరిగిన సూపర్-4 మ్యాచ్ను భారత్ 2-2తో డ్రా చేసుకుంది. మ్యాచ్ ముగిసేందుకు మరో 7 నిమిషాలు ఉన్నాయనగా మన్దీప్ సింగ్ అద్భుతమైన గోల్తో భారత్కు ఓటమి తప్పించాడు. ఈ మ్యాచ్లో గోల్స్ చేసే అవకాశాలను చేజార్చుకున్న భారత్ చివరకు డ్రాతో గట్టెక్కింది.
భారత్ తరఫున హార్దిక్ సింగ్(8వ నిమిషం), మన్దీప్ సింగ్(53వ నిమిషం) రెండు గోల్స్ నమోదు చేయగా.. సౌత్ కొరియాలో జిహున్ యాంగ్(12వ నిమిషం), హైయోన్ హాంగ్ కిమ్(14వ నిమిషం) రెండు గోల్స్ చేశారు.

మ్యాచ్ ఆరంభం నుంచి ఆధిపత్యం చెలాయించిన భారత్ 8వ నిమిషంలో హార్దిక్ సింగ్ చేసిన గోల్తో భారత్ 1-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.అయితే కొరియా జట్టు రెండు నిమిషాల వ్యవధిలోనే రెండు గోల్స్ చేసి షాక్ ఇచ్చింది. 12వ నిమిషయంలో జిహున్ యాంగ్ గోల్ చేయగా.. 14వ నిమిషంలో హైయోన్ హాంగ్ కిమ్ గోల్తో 2-1తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. ఆ తర్వాత గోల్స్ చేసే అవకాశాలు లభించినా భారత్ వృథా చేసుకుంది. దాంతో భారత్కు ఓటమి తప్పదా? అనిపించింది. కానీ 53వ నిమిషంలో మన్దీప్ సింగ్ గోల్స్ చేసి స్కోర్ను 2-2తో సమం చేశాడు. చివరి 7 నిమిషాల ఆటలో భారత్ ఎలాంటి తప్పిదం చేయకుండా మ్యాచ్ను ముగించింది.
చైనాతో జరిగిన మరో సూపర్-4 మ్యాచ్లో మలేసియా 2-0తో గెలిచింది. నేడు జరిగే మ్యాచ్లో కొరియాతో చైనా, మలేసియాతో భారత్ తలపడనున్నాయి. భారత్ హాకీ మ్యాచ్ రాత్రి 7.30 గంటలకు ప్రారంభం కానుంది. సోనీ టీవీ నెట్వర్క్తో పాటు సోనీ లీవ్ యాప్లో ఈ మ్యాచ్ ప్రత్యక్ష ప్రసారం కానుంది.