ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీమెంట్లో ఆతిథ్య భారత్ దుమ్మురేపుతోంది. మలేసియా జట్టుతో గురువారం జరిగిన సూపర్ -4 దశ రెండో మ్యాచ్లో భారత్ 4-1 తేడాతో ఘన విజయం సాధించింది. భారత్ తరఫున మన్ప్రీత్ సింగ్(17వ నిమిషంలో), సుఖ్జిత్ సింగ్(19వ నిమిషంలో), శిలానంద్ లాక్రా(24వ నిమిషంలో), వివేక్ సాగర్ ప్రసాద్(38వ నిమిషంలో) ఒక్కో గోల్ నమోదు చేశారు. మలేసియా తరఫున షఫీక్ హసన్(2వ నిమిషంలో) ఏకైక గోల్ సాధించాడు. ఈ మ్యాచ్లో నెగ్గడం ద్వారా భారత్ తమ ఫైనల్ అవకాశాలను సజీవం చేసుకుంది.
సూపర్-4 టేబుల్లో భారత్ నాలుగు పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది. బుధవారం డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాతో జరిగిన సూపర్-4 తొలి మ్యాచ్ను భారత్ 2-2తో డ్రా చేసుకుంది. శుక్రవారం విశ్రాంతి దినం కాగా.. శనివారం చైనాతో చివరి సూపర్ 4 మ్యాచ్ను భారత్ ఆడనుంది. ఈ మ్యాచ్ డ్రా చేసుకున్నా.. టేబుల్లో తొలి రెండు స్థానాల్లో నిలిచి ఫైనల్కు అర్హత సాధిస్తోంది.

మలేసియాతో జరిగిన మ్యాచ్లో భారత్కు ఆరంభంలోనే ఊహించని షాక్ తగిలింది. మ్యాచ్ మొదలైన రెండు నిమిషాలకే మలేసియా హసన్ గోల్తో ఖాతా తెరచింది. ఈ షాక్ నుంచి త్వరగానే తేరుకున్న భారత్.. ప్రత్యర్థి గోల్ పోస్ట్పై దాడులు చేసింది. తొలి క్వార్టర్లో గోల్ రాకున్నా.. రెండో క్వార్టర్లో ఫలితం దక్కింది. ఏడు నిమిషాల వ్యవధిలోనే భారత్ మూడు గోల్స్ నమోదు చేసి లీడ్లోకి వెళ్లింది. ఆ తర్వాత అదే జోరు కొనసాగించిన టీమిండియా ప్రత్యర్థి జట్టుకు మరో గోల్ చేసే అవకాశం ఇవ్వకుండా విజయాన్ని ఖాయం చేసుకుంది.
మ్యాచ్ మొత్తంలో భారత్కు ఆరు పెనాల్టీ కార్నర్లు లభించగా.. ఒక పెనాల్టీ కార్నర్ను భారత్ గోల్గా మలిచింది. లేదంటే మరింత తేడాతో మలేసియాపై భారత్కు విజయం దక్కేది. గురువారం జరిగిన మరో సూపర్ 4 మ్యాచ్లో చైనా 3-0 గోల్స్ తేడాతో డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియాను ఓడించింది. ప్రస్తుతం చైనా, మలేసియా మూడు పాయింట్లతో సంయుక్తంగా రెండో స్థానంలో కొరియా ఒక పాయింట్తో నాలుగో స్థానంలో ఉంది.