జకార్త: పురుషుల ఆసియాకప్ 2022 టోర్నీలో డిఫెండింగ్ చాంపియన్ భారత్ పోరాటం ముగిసింది. ఫైనల్ చేరాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో భారత జట్టును దురదృష్టం వెంటాడింది. గోల్ తేడాతో టీమిండియా ఫైనల్ చేరకుండా సూపర్-4కే పరిమితమైంది. మంగళవారం దక్షిణ కొరియాతో జరిగిన మ్యాచ్ను భారత్ 4-4తో డ్రా చేసుకుంది. హోరాహోరీగా సాగిన ఈ మ్యాచ్లో ఇరు జట్లు పోటా పోటీగా తలపడ్డాయి.
భారత జట్టులో నీలమ్ సంజీప్(9వ నిమిషం), దిప్సన్ టిర్కీ(21వ నిమిషం), మహేశ్ శేషె గౌడ(22వ నిమిషం), శక్తివేల్ మరీశ్వరణ్(37వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. కొరియా జట్టులో జాంగ్ జాంగ్యూన్(13వ నిమిషం), జీ వూ చీన్(18వ నిమిషం), కిమ్ జంగ్ హూ(28వ నిమిషం), జంగ్ మాంజే(44వ నిమిషం) గోల్స్ చేసి భారత్ విజయాన్ని అడ్డుకున్నారు.
ఈ కీలక మ్యాచ్ ఫలితం తేలకుండా ముగియడంతో భారత్, కొరియా ఖాతాలో చెరో ఐదు పాయింట్లు చేరాయి. అయితే జపాన్తో జరిగిన మరో మ్యాచ్లో మలేసియా 5-0తో విజయం సాధించడం భారత్ ఫైనల్ అవకాశాలను దెబ్బ తీసింది. ఈ మ్యాచ్లో మలేసియా ఓడినా భారత్కు ఫైనల్ చేరే అవకాశం ఉండేది. జపాన్పై విజయంతో మలేసియా ఖాతాలోనూ ఐదు పాయింట్లు చేరాయి. మూడు జట్లు ఐదు పాయింట్లతో సూపర్-4ను ముగించినప్పటికి మెరుగైన గోల్స్ ఉన్న కారణంగా మలేసియా, దక్షిణ కొరియాలు ఫైనల్కు చేరుకున్నాయి. ఇక మూడో స్థానం కోసం భారత్.. జపాన్తో బుధవారం తలపడనుంది. అదే రోజు మలేషియా, దక్షిణ కొరియా మధ్య ఫైనల్ మ్యాచ్ జరగనుంది.