భారత మహిళల హాకీ టీమ్ హెడ్ కోచ్ హరేంద్ర సింగ్ తన పదవికి రాజీనామా చేశాడు. వ్యక్తిగత కారణాలతో హరేంద్ర సింగ్ తప్పుకున్నట్లు హాకీ ఇండియా(హెచ్ఐ) సోమవారం ప్రకటించింది. అంతర్జాతీయ క్వాలిఫైయర్స్కు సన్నదమవుతున్న క్రమంలో ఈ ఘటన చోటు చేసుకోవడం చర్చనీయాంశమైంది.
వ్యక్తిగత కారణాలతోనే హెడ్ కోచ్ పదవి బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు హరేంద్ర సింగ్ మీడియాకు తెలిపారు. 'భారత మహిళల హాకీ టీమ్కు కోచ్గా పనిచేయడం నా జీవితంలోనే అద్భుతమైన ఘట్టం. వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నా.. నా హృదయం ఎప్పుడూ అమ్మాయిల జట్టుతోనే ఉంటుంది. వారి విజయాల కోసం పరితపిస్తోంది. హాకీ ఇండియాతో నా ప్రయాణాన్ని ఎప్పుడూ ఆరాదిస్తాను. భారత హాకీని ఉన్నత స్థాయికి తీసుకెళ్లడానికి వారు చేస్తున్న ప్రయత్నాలకు నా మద్దతు ఎప్పుడూ ఉంటుంది.'అని ఆయన పేర్కొన్నారు.
హరేంద్ర సింగ్ ప్రవర్తనపై జట్టులోని ఆటగాళ్లు అసంతృప్తిగా ఉన్నారని, ఉన్నతాధికారులతో పాటు క్రీడా మంత్రిత్వ శాఖకు ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. హరేంద్ర సింగ్ పర్యవేక్షణలో ఆడలేమని కొందరు ఆటగాళ్లు బెదరింపులకు దిగారని, దాంతోనే అతనిపై వేటు వేసారని ప్రచారం జరుగుతోంది.

మరోవైపు హరేంద్ర సేవలకు కృతజ్ఞతలు తెలుపుతూ.. హాకీ ఇండియా అధ్యక్షుడు డాక్టర్ దిలీప్ టిర్కీ ఓ ప్రకటనను విడుదల చేశారు. 'హరేంద్ర సింగ్ స్ఫూర్తిదాయకమైన సేవలకు ధనవ్యాదాలు. భారత హాకీ అభివృద్ధికి కోసం ఆయన ఎంతో కృషి చేశారు. మరో హెడ్ కోచ్ నియామకం గురించి త్వరలోనే వెల్లడిస్తాం. హరేంద్ర సింగ్కు శుభాకాంక్షలు'అని పేర్కొన్నారు.
2021 టోక్యో ఒలింపిక్స్లో భారత జట్టు నాలుగో స్థానంలో నిలవడంలో కీలక పాత్ర పోషించిన అప్పటి చీఫ్ కోచ్ సోయెర్డ్ మరైన్(నెదర్లాండ్స్) తిరిగి బాధ్యతలు చేపట్టే అవకాశం ఉంది. 2021 ఆగస్టులో మరైన్ చీఫ్ కోచ్ పదవికి రాజీనామా చేయగా.. అమెరికా పురుషుల జట్టుకు కోచ్గా వ్యవహరించిన హరేంద్ర.. 2024 ఏప్రిల్లో భారత మహిళల జట్టు శిక్షణ బాధ్యతలు స్వీకరించాడు. ఏడాది కాలంగా భారత మహిళల జట్టు ప్రదర్శన అద్వాన్నంగా తయారైంది. ఎఫ్ఐహెచ్ ప్రో లీగ్ 2024-25 సీజన్లో 16 మ్యాచ్లాడిన భారత్ కేవలం రెండింట్లో గెలిచింది. తర్వాతి సీజన్కు అర్హత సాధించడంలో విఫలమైంది.