
బర్మింగ్హామ్స్: కామన్వెల్త్ గేమ్స్ ఆడుతున్నామనే కామన్సెన్స్ లేకుండా చొక్కాలు పట్టుకొన్ని కొట్టుకున్నారు హాకీ ఆటగాళ్లు. ఓ అంతర్జాతీయ మ్యాచ్ ఆడుతున్నామనే సోయి మరిచి గల్లీ రౌడీల్లా గొడవ పడ్డారు. ప్రస్తుతం ఈ ఘటన యావత్ క్రీడా ప్రపంచాన్ని నివ్వెరపరిచింది. భారత పురుషుల హాకీ ఈవెంట్లో భాగంగా కెనడా-ఇంగ్లండ్ మధ్య గురువారం జరిగిన పూల్ బీ మ్యాచ్లో ఈ ఘటన చోటు చేసుకుంది.
ఈ మ్యాచ్ హాఫ్ టైమ్ ముగుస్తుందనగా కెనడా ప్లేయర్ బాల్రాజ్ పనేసర్, ఇంగ్లండ్ ఆటగాడు క్రిస్ గ్రిఫిత్స్ మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అప్పటికే ఇంగ్లండ్ 4-1తో ఆధిక్యంలో ఉంది. ఆటలో భాగంగా గ్రిఫిత్స్ బంతిని తీసుకునే ప్రయత్నం చేయగా.. పనేసర్ అడ్డుకున్నాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య తలెత్తిన వివాదం.. తీవ్ర ఘర్షణకు దారి తీసింది. ఎంతలా అంటే ఒకరినొకరు చొక్కాలు పట్టుకొని కొట్టుకునే స్థాయికి వెళ్లింది. ఒకానొక సమయంలో బాల్రాజ్ పనేసర్.. గ్రిఫిత్స్ గొంతు కూడా పిసికేసాడు. దాంతో మైదానంలో ఘర్షణ వాతావరణం తలపించింది. అప్రమత్తమైన సహచర ఆటగాళ్లు ఈ ఇద్దరినీ విడదీశారు.
ఇందుకు సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. హాకీ ఆట కాస్త రెజ్లింగ్లా మారిందని, ఒకే టికెట్పై రెండు ఆటలు చూడొచ్చు అంటూ నెటిజన్లు సెటైర్లు పేల్చుతున్నారు. కొందరైతే ఏమిరా బాల్ రాజ్ ఏం పనిరా ఇది? అంటూ ప్రశ్నిస్తున్నారు. ఈ ఘటనలో బాల్రాజ్దే తప్పిదమని తేల్చిన మ్యాచ్ రిఫరీ రెండ్ కార్డ్తో మైదానం బయటకు పంపించాడు. గ్రిఫిత్స్కు యెల్డో కార్డ్ జారీ చేసి హెచ్చరించాడు.
ఈ మ్యాచ్ విషయానికి వస్తే.. 11-2తో కెనడాను ఓడించిన ఇంగ్లండ్ సెమీస్ చేరింది. ఆస్ట్రేలియాతో సెమీస్ పోరులో అమీతుమీ తేల్చుకోనుంది. మరోవైపు.. భారత్ సైతం తమ చివరి లీగ్ మ్యాచ్లో వేల్స్పై 4-1తో విజయం సాధించి సెమీ ఫైనల్ చేరుకుంది. వైస్ కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ హ్యాట్రిక్ గోల్స్తో రాణించడంతో అద్భుత విజయాన్ని అందుకుంది. సెమీస్లో న్యూజిలాండ్తో తలపడనుంది.