హాంగ్జౌ: ఆసియా గేమ్స్ 2023లో భారత పురుషుల హాకీ టీమ్ చరిత్ర సృష్టించింది. డిఫెండింగ్ ఛాంపియన్ జపాన్తో శుక్రవారం జరిగిన ఫైనల్లో భారత్ 5-1 తేడాతో గెలిచి స్వర్ణ పతకం కైవసం చేసుకుంది. తద్వారా ఆసియా క్రీడల చరిత్రలోనే అత్యధిక గోల్డ్ మెడల్స్ గెలిచిన రెండో హాకీటీమ్గా చరిత్రకెక్కింది.
ఓవరాల్గా ఆసియా క్రీడల్లో భారత పురుషుల హాకీటీమ్కు ఇది 16వ మెడల్ కావడం విశేషం. ఇందులో 4 స్వర్ణాలతో పాటు 9 రజతాలు, 3 కాంస్య పతకాలున్నాయి. ఈ విజయంతో భారత హాకీ టీమ్ ప్యారిస్ ఒలింపిక్స్ 2024 బెర్త్ను ఖరారు చేసుకుంది.

ఆరంభం నుంచి ఆధిపత్యం కొనసాగించిన భారత్.. చివరకు అదే జోరు కొనసాగించింది. తొలి క్వార్టర్లో ఇరు జట్ల ఆటగాళ్లు హోరాహోరీగా తలపడటంతో గోల్స్ నమోదు కాలేదు. రెండో క్వార్టర్లో మన్ప్రీత్ గోల్ చేయడంతో భారత్ ఖాతా తెరిచింది. హాఫ్ టైమ్ ముగిసే సరికి 1-0తో ఆధిక్యంలో నిలిచింది.
మూడో క్వార్టర్లో హర్మన్ప్రీత్ గోల్ చేయడంతో భారత్ ఆధిక్యం డబుల్ అయ్యింది. ఆ కొద్దిసేపటికే లభించిన పెనాల్టీ కార్నర్ను అమిత్ రోహిడాస్ గోల్గా మలిచి భారత్ ఆనంధాన్ని మూడింతలు చేశాడు. బంతిపై పూర్తి ఆధిపత్యం ఉంచిన భారత ఆటగాళ్లు.. ప్రత్యర్థి గోల్ పోస్ట్పై పదే పదే దాడి చేశారు.
జపాన్ డిఫెన్స్ను చేదిస్తూ చాకచక్యంగా గోల్స్ రాబట్టారు. చివరి క్వార్టర్లో అభిషేక్ గోల్ చేయగా.. ఆ వెంటనే పెనాల్టీ కార్నర్ను జపాన్ గోల్గా మలిచి ఖాతా తెరిచింది. కానీ అప్పటికే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. మరో రెండు నిమిషాల్లో ఆట ముగుస్తుందనగా.. హర్మన్ప్రీత్ బుల్లెట్ గోల్ సాధించి.. విజయ లాంఛనాన్ని పూర్తి చేశాడు.
ఆసియా గేమ్స్లో భారత్ ఇప్పటికే 100 పతకాలను ఖాయం చేసుకొని నయా చరిత్రను లిఖించింది. ఇప్పటికే 95 పతకాలను ఖాతాలో వేసుకున్న భారత్.. క్రికెట్, కబడ్డీ, ఆర్చరీ, బ్యాడ్మింటన్ ఈవెంట్లలో మెడల్స్ ఖాయం చేసుకుంది. 72 ఏళ్ల ఆసియా క్రీడల చరిత్రలో భారత్ 100 పతకాల మార్క్ను అందుకోవడం ఇదే తొలిసారి. 2018 ఆసియా క్రీడల్లో 70 పతకాలు గెలిచిన భారత్.. ఇప్పటికే ఈ రికార్డును బ్రేక్ చేసింది.