ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో వరుస విజయాలతో జోరు మీదున్న భారత పురుషుల హాకీ టీమ్ రసవత్తరపోరుకు సిద్దమైంది. వరుసగా నాలుగు విజయాలతో ఇప్పటికే సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్న భారత్.. నేటి(శనివారం) మధ్యాహ్నం తన చివరి రౌండ్ రాబిన్ మ్యాచ్లో దాయాదీ పాకిస్థాన్తో అమీతుమీ తేల్చుకోనుంది.
చైనాపై 3-0, జపాన్పై 5-0, మలేసియాపై 8-1, కొరియాపై3-1 తేడాతో నెగ్గిన పారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ భారత్ పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో కొనసాగుతోంది. మరోవైపు జపాన్, చైనాపై విజయాలతో పాటు మలేసియా, కొరియాతో డ్రా చేసుకున్న పాకిస్థాన్ రెండో స్థానంలో నిలిచింది. 2013 నుంచి పాకిస్థాన్తో ఆడిన 25 మ్యాచ్ల్లో భారత్ 16 గెలిచింది.

చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ మాత్రం 5 విజయాలు మాత్రమే నమోదు చేసింది. మరో 4 మ్యాచ్లు డ్రా అయ్యాయి. చివరగా గతేడాది ఆసియా క్రీడల్లో భారత్-పాక్ తలపడ్డాయి. ఈ మ్యాచ్లో భారత్ 10-2తో పాకిస్థాన్ను చిత్తు చేసింది. ఈ మ్యాచ్ కోసం ఎంతో ఉత్సాహంగా ఎదురు చూస్తున్నామని భారత కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ అన్నారు. ఈ మ్యాచ్ నేపథ్యంలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడారు.
'పాకిస్థాన్ జట్టులోని కొంతమంది ఆటగాళ్లతో జూనియర్ స్థాయి నుంచి ఆడుతున్నాం. వాళ్లతో మాకు ప్రత్యేకమైన అనుబంధం ఉంది. వాళ్లు మా సోదరుల్లాంటివాళ్లే. కానీ మైదానంలో మాత్రం ఇతర ప్రత్యర్థుల్లాగే పాకిస్థాన్తో తలపడతాం. మా భావోద్వేగాలను నియంత్రించుకుంటాం. ప్రపంచ హాకీలో భారత్-పాక్ పోరుకు మరేది సాటిరాదు.
దీని కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న హాకీ అభిమానులు ఎదురు చూస్తున్నారు. పాకిస్థాన్ లాంటి జట్టుతో ఆడుతున్నప్పుడు గత ఫలితాలు పక్కనపెట్టాల్సిందే. ఆ జట్టు కఠినమైంది. ఏ దశలోనైనా పుంజుకోగలదు. ఏ మాత్రం తక్కువ అంచనా వేయకూడదు.'అని హర్మన్ప్రీత్ సింగ్ చెప్పుకొచ్చాడు.
ఫ్రీగా ఎలా చూడాలంటే..
ఈ టోర్నీకి అధికారిక బ్రాడ్కాస్టర్గా సోనీ స్పోర్ట్స్ ఛానెల్ వ్యవహరిస్తోంది. సోనీ టెన్-1,2,3, 4 చానెల్స్తో పాటు తమ నెట్వర్క్కు చెందిన స్థానిక భాషా చానెల్స్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్షం ప్రసారం కానున్నాయి. సోనీ నెట్వర్క్కు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లైవ్ యాప్లో కూడా మ్యాచ్లు రానున్నాయి.
ఫ్రీగా చూడాలనుకుంటే జియో టీవీ యాప్లో సోనీ టెన్ ఛానెల్స్ను సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. యూట్యూబ్ వేదికగా సోనీ చానెల్స్లో హైలైట్స్ వీక్షించవచ్చు.