చెన్నై: ఏషియన్ ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్ను భారత హాకీ టీమ్ సొంతం చేసుకుంది. అసాధారణ ప్రదర్శనతో ఐదో సారి ఫైనల్ చేరిన హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత జట్టు.. శనివారం చెన్నై వేదికగా జరిగిన టైటిల్ ఫైట్లో 4-3 తేడాతో మలేషియాను ఓడించింది.
భారత్ తరఫున జుగ్రాజ్ సింగ్(9వ నిమిషం), హర్మన్ప్రీత్ సింగ్(45వ నిమిషం), గుర్జంత్ సింగ్(45వ నిమిషం), ఆకాశ్దీప్ సింగ్(56వ నిమిషంలో) గోల్స్ సాధించారు. ఆద్యాంతం హోరాహోరీగా సాగిన పోరులో భారత ప్లేయర్లు అసాధారణ ప్రదర్శన కనబర్చారు. సొంత అభిమానుల నుంచి భారత జట్టుకు భారీ మద్దతు లభించింది.

ఈ ఫైనల్ మ్యాచ్కు కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్తో పాటు తమిళనాడు సీఎం డీకే స్టాలిన్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అభిమానులు కూడా భారీ ఎత్తున హాజరై భారత జట్టుకు మద్దతు తెలిపారు. మ్యాచ్ ఆసాంతం స్టేడియం వందేమాతరం నినాదాలతో దద్దరిల్లింది. అభిమానుల మద్దతు ఆటగాళ్లకు ఉత్తేజాన్ని ఇచ్చింది.
ఓ దశలో 1-3తో వెనుకంజలో నిలిచిన భారత్.. అసాధారణంగా పుంజుకొని విజయంతో పాటు టైటిల్ సొంతం చేసుకుంది. భారత్కు ఇది నాలుగో ఏషియన్ ఛాంపియన్స్ టైటిల్.
మ్యాచ్ ఆరంభంలోనే ఆట 9వ నిమిషంలో లెఫ్ట్ కార్నర్ నుంచి హర్మన్ప్రీత్ సింగ్ అందించిన పాస్ను జుగ్రాజ్ సింగ్ అద్భుతంగా గోల్ కొట్టాడు. దాంతో భారత్ 1-0తో ఆధిక్యంలోకి దూసుకెళ్లింది. అయితే ఈ ఆనందం నాలుగు నిమిషాల్లో ఆవిరైంది. మలేషియా ప్లేయర్ అబు కమల్ అజ్రై గోల్ సాధించి స్కోర్లు సమం చేశాడు.
మరో నాలుగు నిమిషాల వ్యవధిలో రాజీ రహీమ్ గోల్ కొట్టి మలేషియా ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. అనంతరం బంతిని తమ ఆదీనంలో ఉంచుకునేందుకు ఇరు జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. మరింత దూకుడుగా ఆడిన మలేషియా 28వ నిమిషంలో అమినుద్దీన్ ముహమద్ సాయంతో గోల్ సాధించి ఆధిక్యాన్ని 1-3తో ట్రిపుల్ చేసుకుంది.
ఫస్టాఫ్ 1-3తో ముగియడంతో భారత శిభిరంలో నిరాశ నెలకొంది. కానీ సెకండాఫ్లో భారత్ దుమ్మురేపింది. దూకుడుగా ఆడుతూ ప్రత్యర్థి డిఫెన్స్కు సవాల్ విసిరింది. మలేషియా గోల్ పోస్ట్పై ముమ్మరంగా దాడులు చేసింది. 45వ నిమిషంలో లభించిన పెనాల్టీ స్ట్రోక్ను హర్మన్ప్రీత్ సింగ్ గోల్గా మలిచి ఆశలు రేకెత్తించాడు.
ఆ వెంటనే గుర్జత్ సింగ్.. హర్మన్ప్రీత్ అందించిన పాస్తో బంతిని గోల్ పోస్ట్లోకి కొట్టి స్కోర్లు సమం చేశాడు. బంతిని ఎక్కువగా తమ ఆధీనంలో ఉంచుకున్న భారత్ను అడ్డుకునేందుకు మలేషియా చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. 56వ నిమిషంలో మన్దీప్ సింగ్ అందించిన పాస్ను గోల్ పోస్ట్లోకి కొట్టిన ఆకాశ్దీప్ సింగ్ భారత్ 4-3కు ఆధిక్యాన్ని అందించాడు. చివరి వరకు ఆధిక్యాన్ని కాపాడుకున్న భారత్.. మలేషియాపై సంచలన విజయాన్నందుకుంది.