చెన్నై: సొంతగడ్డపై జరుగుతున్న ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ హాకీ టోర్నీలో భారత తన జోరును కొనసాగిస్తోంది. ఇప్పటికే ఓటమెరుగని టీమ్గా సెమీఫైనల్ బెర్త్ను ఖరారు చేసుకున్న హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత హాకీ జట్టు.. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ను మట్టి కరిపించింది.
బుధవారం జరిగిన చివరి రౌండ్ రాబీన్ లీగ్ మ్యాచ్లో భారత హాకీ టీమ్ 4-0 తేడాతో పాకిస్థాన్ను చిత్తు చేసింది. టీమిండియా ఆల్రౌండ్ షో ముందు పాకిస్థాన్ నిలబడలేకపోయింది. భారత్ తరఫున కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ రెండు గోల్స్ చేయగా.. జుగ్రాజ్, మన్దీప్ సింగ్ తలో గోల్ సాధించారు.

ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే భారత్ ఆధిపత్యం చెలాయించింది. బలమైన డిఫెన్స్తో పాటు అటాకింగ్ గేమ్తో పాకిస్థాన్ను ఒత్తిడిలోకి నెట్టింది. ఫస్ట్ క్వార్టర్లోనే లభించిన పెనాల్టీ కార్నర్ను కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్ గోల్గా మలిచి భారత్ ఖాతా తెరిచాడు. దాంతో భారత్ 1-0తో తొలి క్వార్టర్ను ముగించింది.
రెండో క్వార్టర్లో పాకిస్థాన్ జోరు కనబర్చగా.. భారత్ అద్భుతంగా డిఫెండ్ చేసింది. గోల్ చేయకుండా అడ్డుకుంది. అనంతరం హార్మన్ప్రీత్ సింగ్ మరో పెనాల్టీ కార్నర్ను గోల్గా మలిచి భారత్ ఆధిక్యాన్ని డబుల్ చేశాడు. అనంతరం భారత్కు మరో పెనాల్టీ కార్నర్ లభించినా సద్వినియోగం చేసుకోలేకపోయింది. దాంతో సెకండ్ క్వార్టర్ 2-0తో ముగిసింది.

మూడో క్వార్టర్లో పాకిస్థాన్ కోచ్ అంపైర్లపై అసహనం వ్యక్తం చేశాడు. తమ జట్టుకు వ్యతిరేకంగా నిర్ణయాలు ప్రకటించారని, ఇలాంటి మ్యాచ్ల్లో అంపైర్లు తప్పిదాలు చేస్తే తిరిగి పుంజుకోవడం కష్టమంటూ మండిపడ్డాడు. సెకండాఫ్, మూడో క్వార్టర్ ఆరంభంలోనే భారత్ మరో గోల్ నమోదు చేసింది. జుగ్ రాజ్ డ్రాగ్ ఫ్లిక్తో బంతిని గోల్ పోస్ట్లోకి పంపించాడు.

అనంతరం అదే జోరును కొనసాగించిన భారత్.. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకొని పాక్ గోల్ పోస్ట్పై పదే పదే దాడులు చేసింది. చివరి క్వార్టర్లో మ్యాచ్ ముగుస్తుందనగా.. మన్దీప్ సింగ్ మరో గోల్ కొట్టి భారత్ ఆనందాన్ని నాలుగింతలు చేశాడు.