ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీలో భారత హాకీ టీమ్ జోరు కొనసాగుతోంది. తొలి మ్యాచ్లో ఆతిథ్య చైనాను ఓడించిన డిఫెండింగ్ ఛాంపియన్ భారత్.. సోమవారం జరిగిన రెండో మ్యాచ్లో 5-1 తేడాతో జపాన్ను చిత్తు చేసింది.
భారత్ తరఫున సుఖ్జీత్(2వ, 60వ నిమిషం), అభిషేక్(3వ నిమిషం), సంజయ్(17వ నిమిషం), ఉత్తమ్ సింగ్(54వ నిమిషం) గోల్స్ నమోదు చేశారు. జపాన్ తరఫున కజుమాసా(41వ నిమిషం) ఏకైక గోల్ చేశాడు.

ఈ మ్యాచ్లో ఆరంభం నుంచే భారత్ దూకుడుగా ఆడింది. ఫస్టాఫ్ రెండో నిమిషంలోనే భారత ప్లేయర్ సుఖ్జీత్ గోల్ చేసి ఖాతా తెరవగా.. సెకన్ల వ్యవధిలోనే అభిషేక్ మరో గోల్తో ఆ ఆనందాన్ని రెట్టింపు చేశాడు. బంతిని పూర్తిగా తమ ఆధీనంలో ఉంచుకున్న భారత్.. పదే పదే ప్రత్యర్థి గోల్డ్ పోస్ట్పై దాడి చేసింది. దాంతో ఫస్ట్ క్వార్టర్లో జపాన్ పూర్తిగా తేలిపోయింది.
రెండో క్వార్టర్లో కాస్త దూకుడు పెంచిన జపాన్.. భారత డిఫెన్స్ను చేధిస్తూ ముందుకు కదిలింది. కానీ ఆరంభంలోనే లభించిన పెనాల్టీ కార్నర్ను సంజయ్ గోల్గా మలిచాడు. దాంతో భారత్ ఆధిక్యం మూడింతలు అయ్యింది. మూడో క్వార్టర్లో ఎట్టకేలకు జపాన్ ఓ గోల్ చేసింది. చివరి క్వార్టర్లో భారత ఆటగాళ్లు ఉత్తమ్ సింగ్, సుఖ్జీత్ చెరో గోల్ చేయడంతో 5-1తో మ్యాచ్ ముగిసింది. సెప్టెంబర్ 11న జరిగే తదుపరి మ్యాచ్లో భారత్.. మలేసియాతో తలపడనుంది.