ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ 2024లో భారత పురుషుల హాకీ టీమ్ అసలు సిసలు సమరానికి సిద్దమైంది. వరుసగా 6 విజయాలతో ఓటమెరుగని జట్టుగా ఫైనల్ చేరిన భారత్.. చైనాతో అమీతుమీ తేల్చుకోనుంది. మంగళవారం మధ్యాహ్నం 3.30 గంటలకు ఈ మ్యాచ్ ప్రారంభం కానుంది. డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత హాకీ టీమ్.. 13 ఏళ్ల ఆసియా ఛాంపియన్స్ ట్రోఫీ చరిత్రలో ఆరో సారి ఫైనల్కు అర్హత సాధించింది.
లీగ్ దశలోభారత్ 3-0తో చైనాను మట్టికరిపించింది. దాంతో ఫైనల్లో హర్మన్ప్రీత్ సింగ్ సారథ్యంలోని భారత్ హాట్ ఫేవరేట్గా బరిలోకి దిగుతోంది. చైనాతో పాటు జపాన్పై 5-0, మలేసియాపై 8-1, కొరియాపై3-1, పాకిస్థాన్ 2-1 తేడాతో నెగ్గిన పారిస్ ఒలింపిక్స్ బ్రాంజ్ మెడలిస్ట్ భారత్.. సెమీఫైనల్లో 4-1తో సౌత్ కొరియాను మట్టికరిపించి మంచి జోరు మీద ఉంది. భారత ఫార్వార్డ్ ప్లేయర్లతో పాటు డిఫెన్స్ విభాగం చాలా పటిష్టంగా ఉంది.

అన్నింటికి మించి ఆటగాళ్ల మధ్య ఉన్న సమన్వయం అద్భుతం. మరోవైపు పాకిస్థాన్ను షూటౌట్లో మట్టికరిపించి సంచలన విజయాన్ని అందుకున్న ఆతిథ్య చైనా.. ఫైనల్లోనూ భారత్ను ఓడించి తొలి టైటిల్ను అందుకోవాలనే పట్టుదలతో ఉంది. అయితే ఏ లెక్కన చూసుకున్న భారత్కు చైనా ఏ మాత్రం పోటీ కాదు. కానీ ఫైనల్ ఒత్తిడిని భారత ఆటగాళ్లు అధిగమించాల్సి ఉంటుంది.
ఫ్రీగా ఎలా చూడాలంటే..
ఈ టోర్నీకి అధికారిక బ్రాడ్కాస్టర్గా సోనీ స్పోర్ట్స్ ఛానెల్ వ్యవహరిస్తోంది. సోనీ టెన్-1,2,3, 4 చానెల్స్తో పాటు తమ నెట్వర్క్కు చెందిన స్థానిక భాషా చానెల్స్లో ఈ మ్యాచ్లు ప్రత్యక్షం ప్రసారం కానున్నాయి. సోనీ నెట్వర్క్కు చెందిన ఓటీటీ ఫ్లాట్ ఫామ్ సోనీ లైవ్ యాప్లో కూడా మ్యాచ్లు రానున్నాయి.
ఫ్రీగా చూడాలనుకుంటే జియో టీవీ యాప్లో సోనీ టెన్ ఛానెల్స్ను సెలెక్ట్ చేసుకొని చూసుకోవచ్చు. యూట్యూబ్ వేదికగా సోనీ చానెల్స్లో హైలైట్స్ వీక్షించవచ్చు.