జకార్తా: హాకీ ఆసియాకప్ 2022లో భాగంగా చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్ను భారత్ డ్రా చేసుకుంది. బుధవారం ఉత్కంఠగా సాగిన ఈ పోరు 1-1 గోల్స్తో ఫలితం తేలకుండా ముగిసింది. జకార్తా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో అఖరి నిమిషం వరకు భారత్.. పాక్పై ఆధిపత్యం చెలాయించగా.. చివరి నిమిషంలో పాక్ గోల్ చేసి ఓటమి తప్పించుకుంది. మ్యాచ్ ప్రారంభం అయిన ఫస్ట్ క్వార్టర్లోనే భారత ఆటగాడు కార్తీ సెల్వమ్ అద్భుత గోల్ చేశాడు. ఆ తర్వాత రెండు క్వార్టర్లలో ఇరు జట్లు హోరాహోరీగా తలపడినప్పటికీ ఒక్క గోల్ కూడా నమోదు కాలేదు.
చివరిదైన నాలుగో క్వార్టర్లో పాకిస్థాన్కు పెనాల్టీ కార్నర్ లభించగా దాన్ని అబ్దుల్ రాణా సద్వినియోగం చేసుకున్నాడు. దీంతో స్కోర్లు సమంగా నిలిచాయి. ఈ ఏడాది జరుగుతున్న సిరీస్లో ఇదే తొలి మ్యాచ్. ఈ రెండు జట్లూ ఆసియాకప్ను మూడేసి సార్లు గెలుచుకున్న విషయం తెలిసిందే.
మరోవైపు మలేషియా, దక్షిణ కొరియా తమ తొలి మ్యాచ్ల్లో ఒమన్, బంగ్లాదేశ్లపై విజమం సాధించాయి. మలేషియా 7-0తో ఒమన్ను ఓడించగా, కొరియా 6-1తో బంగ్లాదేశ్పై గెలిపొందింది. ఇక మంగళవారం(మే 24)న జపాన్తో భారత్ తలపడనుంది.
ప్రతిష్టాత్మక టోక్యో ఒలింపిక్స్లో భారత్ హాకీ పురుషుల జట్టు బ్రాంజ్ మెడల్ సాధించి చరిత్ర సృష్టించింది. 41 ఏళ్ల నిరీక్షణకు తెరదించుతూ విశ్వక్రీడల్లో మెడల్ సాధించింది. దాంతో మరోసారి హాకీపై దేశవ్యాప్తంగా ఆదరణ పెరిగింది.