ఆసియా కప్ పురుషుల హాకీ టోర్నీలో భారత జట్టు శుభారంభం చేసింది. శుక్రవారం మొదలైన ఈ టోర్నీలో భాగంగా జరిగిన పూల్ ఏ లీగ్ మ్యాచ్లో టీమిండియా 4-3 గోల్స్ తేడాతో చైనాను ఓడించింది. భారత జట్టు కెప్టెన్ హర్మన్ప్రీత్ సింగ్(20వ, 33వ, 47వ నిమిషాల్లో) హ్యాట్రిక్ గోల్స్ నమోదు చేసి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. మరో గోల్ను జుగ్రాజ్ సింగ్(18వ నిమిషం) నమోదు చేశాడు.
చైనా తరఫున షిహావో డు(12వ నిమిషం), బెన్ హాయ్ చెన్(35వ నిమిషం), జీషెంగ్ గావో(41వ నిమిషం) చెరో గోల్ చేశారు. ఈ మ్యాచ్లో నమోదైన ఏడు గోల్స్ పెనాల్టీ కార్నర్ల ద్వారానే రావడం విశేషం. హ్యాట్రిక్ గోల్స్తో భారత విజయంలో కీలక పాత్ర పోషించిన హర్మన్ప్రీత్ సింగ్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డ్ లభించింది. హర్మన్ప్రీత్కు 200 డాలర్ల చెక్ను హాకీ ఇండియా అధ్యక్షుడు దిలీప్ టిర్కీ అందజేశారు.

తమకంటే తక్కువ ర్యాంక్ ఉన్న చైనాపై భారత్ సునాయస విజయం సాధిస్తుందని ఆశించినా.. ప్రత్యర్థి జట్టు నుంచి ఊహించని ప్రతిఘటన ఎదురైంది. భారత జట్టుకు మొత్తం 11 పెనాల్టీ కార్నర్లు లభించగా.. నాలుగింటిని మాత్రమే సద్వినియోగం చేసుకుంది. చైనా జట్టు ఆరు పెనాల్టీ కార్నర్ల్లో మూడింటిని గోల్స్గా మలిచింది. తొలి రోజు జరిగిన ఇతర లీగ్ మ్యాచ్ల్లో మలేసియా 4-1తో బంగ్లాదేశ్ జట్టుపై డిఫెండింగ్ ఛాంపియన్ సౌత్ కొరియా 7-0తో చైనీస్ తైపీపై జపాన్ 7-0తో కజకిస్తాన్పై, జపాన్ 7-0తో కజకిస్తాన్పై గెలుపొందాయి. భారత జట్టు తమ తదుపరి మ్యాచ్ను ఆదివారం జపాన్తో ఆడనుంది.