అంకారా (టర్కీ): తనకు నచ్చడం లేదని ఓ టర్కీ ఫుట్ బాలర్ కన్న కొడుకునే కడతేర్చాడు. పైగా ఏమి ఎరుగనట్టు కరోనాతో చనిపోయాడని సీన్ క్రియేట్ చేశాడు. కానీ, పది రోజుల తర్వాత తీవ్ర పశ్చాత్తాపానికి లోనై పోలీసులకు లొంగిపోయి తన నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘాతుకం యావత్ ప్రపంచాన్నే నివ్వెరపరించింది.
టర్కీ స్థానికి అమెచ్యూర్ ఫుట్బాల్ లీగ్లోని బుర్సా టీమ్ మిడ్ఫీల్డర్ అయిన కెవెర్ టోక్టాస్.. కరోనా వైరస్ లక్షణాలతో బాధపడుతున్న తన ఐదేళ్ల కుమారుడు ఖాసింను గత నెల 23న ఆస్పత్రిలో చేర్పించాడు. ఆ బాబుకు సహాయకుడిగా టోక్టాస్ను కూడా ఐసోలేషన్ వార్డులో ఉంచారు. చికిత్స జరుగుతుండగానే ఈనెల 4న ఫుట్బాలర్..ఆ చిన్నారిని దిండుతో ఊపిరాడకుండా చేసి అత్యంత కిరాతకంగా చంపేశాడు. ఏమీ ఎరుగనట్టుగా డాక్టర్లను పిలవడంతో వారు ఐసీయూకు తరలించి రెండు గంటలపాటు ప్రయత్నించినా ఫలితం లేకపోయింది.
నిజానికి ఆ చిన్నారికి కరోనా నెగెటివ్ వచ్చినా కూడా అతడి మృతిపై అప్పట్లో ఎవరికీ సందేహం రాలేదు. కానీ, పది రోజుల తర్వాత తీవ్ర పశ్చాత్తాపంతో టోక్టాస్ పోలీసులకు లొంగిపోయి అసలు విషయాన్ని తెలిపాడు. '15 నిమిషాల పాటు దిండుతో చిన్నారి మొహంపై గట్టిగా అదిమా. కొద్దిసేపయ్యాక తీసేయడంతో కదలికలు ఆగిపోయాయి. వెంటనే డాక్టర్లను పిలవడంతో ఎవరికీ సందేహం రాలేదు. వాడంటే నాకు మొదటి నుంచీ ఇష్టం లేదు. అందుకే చంపాను. మానసికంగా నేను ఆరోగ్యంగానే ఉన్నా' అని టోక్టాస్ వివరించాడు. దీంతో పోలీసులు కేసునమోదు చేసుకొని విచారణ ప్రారంభించారు.
కరోనా తెచ్చిన కష్టం.. ఫుడ్ డెలివరీ బాయ్గా మారిన ఒలింపిక్ విజేత