న్యూఢిల్లీ: భారత్లో ఫుట్బాల్ అనగానే చాలామందికి గుర్తొచ్చే పేరు సునీల్ ఛెత్రి. మన దేశంలో ఎంతో మంది గొప్ప ప్లేయర్లలో ఈ భారత ఫుట్బాల్ టీమ్ కెప్టెన్ ఒకడు. దేశం తరఫున అత్యధిక ఇంటర్నేషనల్ గోల్స్ చేసిన సునీల్.. కెరీర్ ప్రారంభంలో ఒత్తిడి తట్టుకోలేక ఏడ్చిన రోజులున్నాయని చెప్పాడు. ఆ టైమ్లో ఆటనే వదిలేద్దామని కూడా అనుకున్నానని తెలిపాడు. చివరకు కుటుంబ సభ్యుల ప్రోత్సాహంతో ఇంతవరకు రాగలిగానని అన్నాడు.
'ఆటలో తొలి ఏడాది బాగానే గడిచింది. 20-30 నిమిషాల పాటు మ్యాచ్లో ఆడే అవకాశం దొరికేది. అప్పుడే ప్రేక్షకులు నన్ను తమ అభిమాన ప్లేయర్ బైచుంగ్ భూటియాతో పోల్చేవారు. కానీ కోల్కతాలో ఫుట్బాల్ అన్నింటిని చాలా త్వరగా నేర్పిస్తుంది. ఓటమిని కోల్కతాలో సహించేవారు కాదు. అంచనాలు అందుకోలేని సమయంలో తీవ్రంగా విమర్శించేవారు. దీంతో ఒత్తిడి పెరిగిపోయి చాలా సార్లు ఏడ్చేవాడిని. ఓసారైతే మా నాన్నను పిలిచి ఇక ఫుట్బాల్ ఆడలేనని చెప్పాను. స్వతహాగా క్రీడాకారులైన నా తల్లిదండ్రులు నాకు అండగా నిలిచారు. వారి ప్రోత్సాహంతోనే ఇక్కడి దాకా వచ్చా'అని 35 ఏళ్ల ఛెత్రి చెప్పుకొచ్చాడు.
ఆ ట్వీట్ తొలగించు.. బబితా ఫోగాట్కు గుత్తా జ్వాలా స్వీట్ వార్నింగ్
సికింద్రాబాద్లో జన్మించిన ఛెత్రి 2005లో భారత్కు తొలిసారి ప్రాతినిధ్యం వహించాడు. అప్పటికే భూటియా, రెనెడీ సింగ్ లాంటి వాళ్ల పోలికలతో అతనిపై చాలా ఒత్తిడి ఉండేది. 'ఇతరులతో నన్ను పోల్చడం సరికాదు. అదృష్టవశాత్తు నేను టీమ్లో చేరే సరికి బైచుంగ్ భాయ్ కూడా ఉన్నారు. ఆయనతో పాటు మిగిలిన వాళ్లు కూడా నన్ను ఎంతో ప్రోత్సహించేవారు.
అందరూ నేను స్కోరు చేస్తే చూడాలని ఆశపడేవారు. దాని వల్లే జాతీయ జట్టు తరఫున 70కిపైగా గోల్స్ సాధించా. అప్పుడే కాదు.. పాకిస్థాన్లో ఆ టీమ్పై జరిగిన మ్యాచ్తో అరంగేట్రం చేసినప్పటి నుంచి ఇప్పటిదాకా జట్టులోని ప్రతీ ఒక్కరూ నేను గోల్ చేస్తే చూడాలని కోరుకుంటారు' అని ఛెత్రి తెలిపాడు. 18 ఏళ్ల తన తన ఫుట్బాల్ కెరీర్లో ఛెత్రి భారత్ తరఫున 72 గోల్స్ చేశాడు.