భారత ఫుట్బాల్ దిగ్గజం సునీల్ ఛెత్రి మళ్లీ టీమిండియా జెర్సీలో మెరవనున్నాడు. తన రిటైర్మెంట్ను వెనక్కి తీసుకుంటున్నట్లు ఈ ఫుట్బాల్ కింగ్ ప్రకటించాడు. ఈ విషయాన్ని ఆలిండియా ఫుట్బాల్ ఫెడరేషన్ సోషల్ మీడియా వేదికగా ప్రకటించింది. 'సునీల్ ఛెత్రి జట్టులోకి తిరిగొచ్చాడు. భారత ఫుట్బాల్ దిగ్గజం, కెప్టెన్ సునీల్ ఛెత్రి మార్చిలో ఫిఫా మ్యాచ్లు ఆడేందుకు సిద్దమవుతున్నాడు'అని ఏఐఎఫ్ఎఫ్ తమ సోషల్ మీడియా ఖాతాల్లో పేర్కొంది.
40 ఏళ్ల సునీల్ ఛెత్రి గతేడాది జూన్లో అంతర్జాతీయ ఫుట్బాల్ కెరీర్కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇంటర్నేషనల్ కెరీర్కు వీడ్కోలు పలికినా.. ఇండియన్ సూపర్ లీగ్లో కొనసాగుతున్నాడు. తాజా సీజన్లో అతను 12 గోల్స్ నమోదు చేశాడు. భారత ఆటగాళ్లలో అత్యధిక గోల్స్ నమోదు చేసిన ప్లేయర్గా నిలిచాడు. గతేడాది దారుణంగా విఫలమైన బెంగళూరు ఎఫ్సీ.. సునీల్ ఛెత్రి అసాధారణ ప్రదర్శనతో ఈ సారి ప్లే ఆఫ్స్కు అర్హత సాధించింది.

అత్యుత్తమ ఫామ్లో ఉన్న సునీల్ ఛెత్రి ఏఐఎఫ్ఎఫ్ విజ్ఞప్తి మేరకు రిటైర్మెంట్ను వెనక్కి తీసుకున్నట్లు తెలుస్తోంది. అయితే ఈ నిర్ణయంపై భారత ఫుట్బాల్ వర్గాల్లో భిన్నాభిప్రాయం వ్యక్తమవుతోంది. కొందరు సునీల్ ఛెత్రి నిర్ణయాన్ని సమర్థిస్తే.. మరికొందరు తప్పుబడుతున్నారు. యువ ఆటగాళ్లకు అవకాశాలు దక్కయని, ఇంకెన్నాళ్లు సునీల్ ఛెత్రిపైనే టీమిండియా ఆధారపడుతుందని విమర్శిస్తున్నారు. ప్రతిభ కలిగిన ఆటగాళ్లను తయారు చేయడంలో ఏఐఎఫ్ఎఫ్ విఫలమైందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
2005లో అంతర్జాతీయ ఫుట్బాల్లోకి అరంగేట్రం చేసిన సునీల్ ఛెత్రీ.. 151 మ్యాచ్ల్లో 94 గోల్స్ నమోదు చేశాడు. ఫుట్బాల్ దిగ్గజాలు క్రిస్టియానో రొనాల్డో,(217 మ్యాచ్ల్లో 135 గోల్స్) లియోనల్ మెస్సీ (191 మ్యాచ్ల్లో 112 గోల్స్) మాత్రమే ఛెత్రీ కంటే ముందున్నారు. భారత్.. ఈ నెల బంగ్లాదేశ్, మాల్దీవులతో ఆడనుంది. ఈ మ్యాచ్లతోనే సునీల్ ఛెత్రి రీఎంట్రీ ఇవ్వనున్నాడు.