
హైదరాబాద్: రష్యా వేదికగా జరుగుతున్న వరల్డ్ కప్లో నాకౌట్ బరిలో నిలవాలంటే తప్పక గెలవాల్సిన మ్యాచ్లో అర్జెంటీనా జట్టు అద్భుత ప్రదర్శన చేసింది. మంగళవారం నైజీరియాతో జరిగిన పోరులో 2-1 తేడాతో విజయం సాధించి నాకౌట్కు అర్హత సాధించింది.
వరల్డ్ కప్లో ఏరోజు ఏమ్యాచ్ | వరల్డ్ కప్ 2018 పాయింట్ల పట్టిక | వరల్డ్ కప్ 2018 పూర్తి షెడ్యూల్
దీంతో అర్జెంటీనా స్టార్ ప్లేయర్ లియోనల్ మెస్సీపై ప్రశంసల వర్షం కురుస్తోంది. అదే, ఈ మ్యాచ్లో అర్జెంటీనా జట్టు గనుక విజయం సాధించకుంటే మెస్సీ... అభిమానుల ఆగ్రహానికి గురయ్యేవాడు. టోర్నీలో భాగంగా జరిగిన మొదటి రెండు మ్యాచ్ల్లో మెస్సీ ప్రదర్శన మెరుగ్గా లేదు.
పసికూన ఐస్ల్యాండ్తో జరిగిన మ్యాచ్ని డ్రా చేసుకున్న అర్జెంటీనా, ఆ తర్వాత క్రొయేషియాతో జరిగిన మ్యాచ్లో 2-0తో ఓటమిపాలై తీవ్ర విమర్శల పాలైంది. దీంతో అర్జెంటీనా జట్టు నాకౌట్కు చేరుతుందా? లేదా అన్న ప్రశ్న మెస్సీ అభిమానులను వేధించింది.

అంతేకాదు అర్జెంటీనా జట్టు నాకౌట్కు చేరాలంటే నైజీరియాతో జరిగే కీలకంగా మారింది. నైజీరియాతో జరిగే మ్యాచ్లో లియోనల్ మెస్సీ అద్భుత ప్రదర్శన చేయాలని, అదే విధంగా క్రొయేషియా-ఐస్ ల్యాండ్ జట్ల మధ్య జరిగే మ్యాచ్లో ఐస్ల్యాండ్ ఓడిపోవాలని ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెస్సీ అభిమానులు ప్రార్ధనలు చేశారు.
వారి ప్రార్ధనలు ఫలించాయి. నైజీరియాపై అర్జెంటీనా విజయం సాధించింది. అదే విధంగా ఐస్ల్యాండ్ జట్టు క్రొయేషియా చేతిలో ఓటమిపాలైంది. దీంతో గ్రూప్-డి నుంచి క్రొయేషియా, అర్జెంటీనా జట్లు నాకౌట్కు అర్హత సాధించాయి. అయితే, నైజీరియాతో జరిగిన మ్యాచ్లో మెస్సీ రాణించాలని కోరుకున్న వారిలో టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ కూడా ఉన్నాడు.
నైజీరియాతో మ్యాచ్ ప్రారంభానికి ముందు సౌరవ్ గంగూలీ తన ట్విట్టర్లో "మెస్సీ జీవితంలో ఇది అతిపెద్ద గేమ్... చూద్దాం ఆ ఛాంపియన్ ఏం చేస్తాడో" అని ట్వీట్ చేశాడు. మ్యాచ్ ప్రారంభమైంది. ఇరు జట్లు తొలి గోల్ కోసం హోరాహోరీగా పోటీ పడుతున్నాయి. 14వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మెస్సీ గోల్ చేసి జట్టుకు 1-0 ఆధిక్యాన్ని అందించాడు.
దీంతో సౌరవ్ గంగూలీ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాడు. తిరిగి మళ్లీ ట్విట్టర్లో మెస్సీ అంటూ ట్వీట్ చేశాడు. మెస్సీ కొట్టిన గోల్కు ఓ ప్రత్యేకత కూడా ఉంది. ఎందుకంటే రష్యా వేదికగా జరుగుతున్న ఈ మెగా టోర్నీలో ఇది వందో గోల్ కావడం విశేషం.
ఆ తర్వాత 51వ నిమిషంలో నైజీరియా ఆటగాడు విక్టర్ మోసెస్ పెనాల్టీ ద్వారా గోల్ సాధించి స్కోరును సమం చేశాడు. ఇక అక్కడి నుంచి ఇరు జట్ల మధ్య పోరు ఆసక్తికరంగా సాగింది. 86వ నిమిషంలో అర్జెంటీనా ఆటగాడు మార్కస్ రోజో మరో గోల్ కొట్టడంతో అర్జెంటీనా 2-1 ఆధిక్యాన్ని అందించాడు.
ఆట ముగిసేలోపు నైజీరియా మరో గోల్ చేయకపోవడంతో ఈ మ్యాచ్లో అర్జెంటీనా విజయం లాంఛనమైంది. దీంతో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న మెస్సీ అభిమానులు ఊపిరి పీల్చుకున్నారు. మరోవైపు క్రొయేషియా చేతిలో ఐస్ల్యాండ్ ఓడిపోవడంతో అర్జెంటీనా నాకౌట్కు వెళ్లడం లాంఛనమైంది. వరల్డ్ కప్లో నాకౌట్కు చేరడం అర్జెంటీనాకు ఇది వరుసగా నాలుగోసారి.