బెంగళూరు: సునీల్ ఛెత్రీ సారథ్యంలోని భారత ఫుట్బాల్ జట్టు మరో ట్రోఫీపై గురిపెట్టింది. సౌత్ ఏషియన్ ఫుట్బాల్ ఫెడరేషన్(శాఫ్) ఛాంపియన్షిప్లో ఫైనల్ చేరిన డిఫెండింగ్ చాంపియన్ భారత్ తొమ్మిదో టైటిల్పై కన్నేసింది. నేడు(మంగళవారం) బెంగళూరులోని కఠీరవం స్టేడియంలో జరిగే టైటిల్ పోరులో కువైట్తో అమీతుమీ తేల్చుకోనుంది.
లెబనాన్తో సెమీఫైనల్లో పెనాల్టీ షూటౌట్లో విజయం సాధించిన ఛెత్రీ సేన జోరు మీదుంది. ఈ టోర్నీ లీగ్ దశలో భారత్- కువైట్ మధ్య జరిగిన మ్యాచ్ 1-1తో డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో కెప్టెన్ సునీల్ ఛెత్రీ గోల్తో టీమిండియా ఆధిక్యం సాధించినా.. సెల్ఫ్ గోల్ కారణంగా విజయాన్నందుకోలేకపోయింది.

ఈ నేపథ్యంలో ఫైనల్లో దూకుడుగా ఆడి 9వ టైటిల్ కైవసం చేసుకోవాలని టీమిండియా పట్టుదలతో ఉంది. ఎప్పటిలాగే కెప్టెన్ ఛెత్రీనే జట్టుకు కీలకం కానున్నాడు. లీగ్ దశలో మూడు మ్యాచ్ల్లోనూ గోల్ కొట్టిన ఈ స్టార్ ప్లేయర్.. లెబనాన్తో సెమీస్లో నిర్ణీత సమయంలో బంతిని లక్ష్యానికి చేర్చలేకపోయాడు. ఫైనల్లో అతను చెలరేగుతాడని భారత్ ఆశలు పెట్టుకుంది.
సొంత ప్రేక్షకుల మధ్య ఆడటం భారత్కు కలిసి రానుంది. హెడ్ కోచ్ ఇగోర్ స్టిమాక్పై రెండు మ్యాచ్ల నిషేధం విధించడంతో.. అసిస్టెంట్ కోచ్ మహేష్ జట్టు బాధ్యతలను నిర్వర్తించనున్నాడు. పాకిస్థాన్, కువైట్తో జరిగిన మ్యాచ్ల్లో వరుసగా రెండు ఎల్లో కార్డులు ఎదుర్కొని లెబనాన్పై ఆడలేకపోయిన కీలక డిఫెండర్ సందేశ్ తిరిగి జట్టులోకి చేరడం భారత్ బలాన్ని పెంచింది.
అన్వర్ అలీ స్థానంలో అతను బరిలోకి దిగనున్నాడు. ఉదాంత సింగ్ ఫామ్ కూడా కీలకమే. అయితే కువైట్తో పోరు అంత సులువు కాదని ఛెత్రీ టీమ్కు తెలుసు. ముఖ్యంగా ఆ జట్టు పటిష్టమైన డిఫెన్స్ను ఛేదించడం టీమిండియాకు పెద్ద సవాల్. ఏమాత్రం అలసత్వానికి చోటిచ్చినా పరాభవం తప్పదు.
కువైట్తో హోరాహోరీ ఖాయమని, సాంకేతికంగా ఆ జట్టు బలంగా ఉందని స్టార్ డిఫెండర్ సందేశ్ తెలిపాడు. తమ పోరాటాన్ని ఏమాత్రం ఆపినా వెంటనే స్కోరు చేసే సత్తా కువైట్కు ఉందని చెప్పుకొచ్చాడు. 2005 తర్వాత స్వదేశంలో భారత్.. ఏ టోర్నీలోనూ ఫైనల్లో ఓడిపోలేదు.