హైదరాబాద్: ఫుట్బాల్ దిగ్గజం డీగో మారడోనా అకాల మరణంతో యావత్ క్రీడాలోకం శోకసంద్రంలో మునిగింది. ప్రపంచ ఫుట్బాల్ చరిత్రలో ఆల్టైమ్ గ్రేట్గా నిలిచిన అర్జెంటీనా దిగ్గజం డీగో మారడోనా (60) బుధవారం గుండెపోటుతో కన్నుమూసిన విషయం తెలిసిందే. తనదైన ఆటతో యావత్ ప్రపంచాన్ని ఉర్రూతలూగించిన మారడోనా.. వెలకట్టలేని జ్ఞాపకాలను అభిమానులకు అందించి నిష్క్రమించాడు.
మారడోనాకు ప్రపంచవ్యాప్తంగా అభిమానులున్నారు. అతని అకాల మరణంతో వారంతా శోకసంద్రంలో మునిగారు. సోషల్ మీడియా వేదికగా మారడోనా జ్ఞాపకాలను నెమరవేసుకుంటూ నివాళులర్పిస్తున్నారు.
ఈ క్రమంలోనే బ్రెజిల్ ఫుట్ బాల్ దిగ్గజం పీలే సహచర ఆటగాడి మృతి పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశాడు. మారడోనా మృతికి నివాళులర్పిస్తూ అతను చేసిన వ్యాఖ్యలు ప్రతీ ఒక్కరిని కదిలిస్తున్నాయి. ఏదో ఒకరోజు పైలోకంలో మారడోనాతో కలిసి ఫుట్ బాల్ ఆడుతానని పీలే అన్నాడు. 'ఎంత విషాదకరం. గొప్ప స్నేహితుడిని, కోల్పోయా. ప్రపంచం ఓ దిగ్గజాన్ని కోల్పోయింది. ఏదో ఒకరోజు పైలోకంలో మారడోనాతో కలిసి ఫుట్బాల్ ఆడతా.. మిత్రమా త్వరలోనే కలుద్దాం'అంటూ పీలే భావోద్వేగానికి గురయ్యారు.
డీగోకు మరణంలేదని, భౌతికంగా దూరమైనా మన మనసుల్లో సజీవంగానే ఉంటాడని అర్జెంటీనా ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ తెలిపాడు.'అర్జెంటీనాకు, ఫుట్బాల్కు ఇది విషాదకరమైన రోజు. మనల్ని వదిలివెళ్లినా అతనెప్పటికీ మనతోనే ఉంటాడు. డీగోకు మరణం లేదు'అని ట్వీట్ చేశాడు. మారడోనా త్వరగా వెళ్లిపోయినా ఆటలోని అతని మాయాజాలం ఎప్పటికీ ఉంటుందని పోర్చుగల్ స్టార్ క్రిస్టియానో రోనాల్డో ట్వీట్ చేశాడు. 'అనితరసాధ్యుడు. అతను త్వరగా వెళ్లిపోయుండొచ్చు.. కానీ, ఆటలో అతని మాయాజాలం ఎప్పటికీ ఉంటుంది'అని పేర్కొన్నాడు.
న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న పాక్ ఆటగాళ్లకు కరోనా.. సిరీస్పై నీలినీడలు!